బాబు వల్లే టిలో వర్షాల్లేవు, వాళ్లు బఫూన్లు: నాయిని
సోమవారం నల్గొండలోని వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన 1969 తెలంగాణ ఉద్యమకారుల సదస్సుకు మంత్రులు నాయిని, జగదీశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. సిఎం కెసిఆర్ చేపడుతోన్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, టిడిపిలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పాల్పడ్డ అక్రమాలను బయటపెడతామని నాయిని హెచ్చరించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలకు నల్గొండ జిల్లా ఫొరైడ్ బాధితుల శాపం తగుల్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును విమర్శించే నైతిక హక్కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు. టి కాంగ్రెస్ నేతలంతా బఫూన్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో కరెంటు కోతలకు గత ప్రభుత్వాలే కారణమని నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కలిపిన ముంపు మండలాలను తెలంగాణకు తీసుకొచ్చాకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడాలని అన్నారు. వచ్చే రెండు నెలల్లో తెలంగాణలో కరెంటు కష్టాలు తీరనున్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు చేసి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని కోరారు.