మాపై పవన్ విమర్శలు అప్పట్నుంచే: మోడీ, గవర్నర్పై మంత్రి నక్కా తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన నాటి నుంచి ఏపీ టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు.
పవన్-జగన్ది ఒకేదారి, కేంద్రం రెచ్చగొడుతోంది: పవన్ వ్యాఖ్యలపై బాబు, గవర్నర్పై విమర్శలు
విభజన కారకుడు
మోడీ ప్రభుత్వానికి సిగ్గుందా? 11ఏళ్లుగా నరసింహన్ గవర్నర్గా కొనసాగుతున్నారు. గవర్నర్గా ఆయనను ఇన్నేళ్లు ఎలా కొనసాగిస్తారు?. గవర్నర్ వ్యవస్థకు నర్సింహన్ కళంకం తెస్తున్నారు. ఈ గవర్నర్ వ్యవస్థ వేస్ట్. రాష్ట్ర విభజనకు కారకుడు గవర్నరే' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రానికి తాబేదారుగా
అంతేగాక, ‘కేంద్రానికి తాబేదారుగా పొలిటికల్ వ్యవహారాలు నడుపుతూ కేంద్రానికి సంధానకర్తగా ఉంటున్నారు. గవర్నర్కు ఇచ్చిన బడ్జెట్ ఆయన గుళ్లు, గోపురాలు తిరగడానికే సరిపోతుంది' అని నక్కా ఆనంద్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అప్పట్నుంచే పవన్ మాపై విమర్శలు
‘జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో రాయబారాన్ని గవర్నరే చేశారు. పవన్ను గవర్నర్ పిలిపించుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి?. ఆయనతో భేటీ అయ్యాకే పవన్ మాపై విమర్శలు చేస్తున్నారు. మోడీ, అమిత్ షా, మాఫియా కింగ్స్గా వ్యవహరిస్తున్నారు.' అని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్ పాపం పోవాలంటే..
ఇది ఇలా ఉండగా, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్రలో చిత్తశుద్ధి లేదన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో నిజాయితీ ఉందన్నారు. గురువారం లోటస్పాండ్కు, శుక్రవారం కోర్టుకు వెళ్లడం మాని.. పులివెందుల వద్ద కృష్ణా నీటిని తలపై చల్లుకుంటే జగన్ పాపం పోతుందని వ్యాఖ్యానించారు. పోలవరం ఎత్తు పెరుగుతుంటే జగన్ గుండెల్లో గుబులు పుడుతోందన్నారు. ఇప్పటి వరకు 4.71 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశామని, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని మంత్రి దేవినేని వివరించారు.