అప్పుడే ఎన్టీఆర్ వారసులం: హోదాపై హరికృష్ణ, మహానాడుకు అందుకే వెళ్లలేదు
హైదరాబాద్: ప్రతి ఇంటి నుంచి ఒక్కరు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, దిగవంత ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. సమిష్టిగా పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధించినప్పుడే ఎన్టీ రామారావు వారసులం, తెలుగు బిడ్డలం అనిపించుకుంటామని ఆయన అన్నారు.
ఎన్టీ రామారావు 94వ జయంతి సందర్భంగా ఆయన తన కుమారులు కళ్యాణ్ రామ్, తారకరత్నలతో కలిసి శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించడానికి జాతిని మేల్కొల్పాలని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా సాధనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని ఆయన అన్నారు. హోదా ఇస్తామన్నవాళ్లు, తెస్తామన్నవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగారు. ఎన్టీఆర్కు నివాళులు అర్పించడం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని అన్నారు. ఎన్టీఆర్ జయంతి కన్నా ముఖ్యమైన కార్యక్రమం తనకు ఏదీ లేదని, అందుకే తాను తెలుగుదేశం పార్టీ మహానాడుకు వెళ్లలేదని ఆయన చెప్పారు.
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ గూడు కట్టుకున్నారని, తెలుగుజాతి మనుగడ ఉన్నంత కాలం ఎన్టీఆర్ బతికే ఉంటారని ఆయన అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవరం దెబ్బ తిన్న సమయంలో ముందుకు వచ్చి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన అన్నారు.