నందమూరి సుహాసినికి కీలక పదవి
నందమూరి హరికృష్ణ కుమార్తె, తెలుగుదేశం నాయకురాలైన నందమూరి సుహాసినికి పార్టీలో కీలక పదవి లభించింది. తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్న టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర కమిటీ విస్తరణలో ముగ్గురికి స్థానం కల్పించారు.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్ పల్లి నియోజకవర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు (కొల్లాపూర్ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బీ విఠల్ (బాన్సువాడ నియోజకవర్గం) నియమితులయ్యారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి (ఖైరతాబాద్), జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కరాటే రమేష్ ను నియమిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.

నందమూరి సుహాసిని ఏపి రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట లేదంటే మరో నియోజకవర్గం నుండి సుహాసిని పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజాగా సుహాసినికి తెలంగాణ రాష్ట్ర కమిటీలో పదవి లభించడంతో ఆమె ఏపికి వస్తారనే వార్తలకు తెరపడినట్లైంది.
చిలకలూరిపేట నుంచి ప్రస్తుతం ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి నందమూరి సహాసిని సరైన అభ్యర్థి అవుతారని, వచ్చే ఎన్నికల్లో ఆమె పేట నుంచి పోటీకి దిగబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం సుహాసినిని రాష్ట్ర కమిటీలో నియమించడంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications