తెర వెనుక వ్యూహం: ఆ ప్రమఖుడెవరు? ‘నంది’పై ఓపెన్గా రాని ప్రముఖులు.. దటీజ్ బాబు స్పెషాలిటీ
నంది అవార్డుల ఎంపికలో అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారుల అభ్యంతరాలను తోసి రాజన్నారని సమాచారం.
అమరావతి/ హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో 'నంది' అవార్డులు అంటే ఒక క్రేజీ. ప్రతీసారీ ఏదో వివాదం తలెత్తూనే ఉన్నది. కానీ ఈ దఫా అవార్డుల ప్రకటన విపరీత పోకడలకు దారి తీస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ తెలుగుదేశం పార్టీ. సీఎం చంద్రబాబు, ఆయన వియ్యంకుడు నందమూరి బాలక్రుష్ణ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే నంది అవార్డుల ఎంపికలో తెర వెనుక అధికార టీడీపీకి చెందిన ప్రముఖుడు ఉన్నారని, అందువల్లే ఇన్ని వివాదాలు తలెత్తుతున్నాయని యావత్ తెలుగు సమాజంలో చర్చ జరుగుతోంది.
Recommended Video
ఈ లోటు పాట్లకు, తప్పొప్పులకు కారణం ఎవరన్న సంగతి చర్చానీయాంశంగా మారింది. పరిస్థితి విషమిస్తున్నా ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 'సరైన సమయంలో సరైన స్పందన' అన్న రీతిలో మౌన ముద్ర వహిస్తున్నారు. దీనికి తోడు ఆయన వద్దే సినిమాటోగ్రఫీ శాఖ ఉంచేసుకున్నారు మరి. పలువురు సినీ దర్శక, నిర్మాతలు మీడియా సమావేశాల్లోనూ, టీవీ చానెళ్ల చర్చల్లోనూ బహిరంగంగా చర్చల్లో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎంగా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చంద్రబాబు నుంచి వివరణ రాకపోవడం సందేహస్పదంగా మారుతోంది.
అవకతవకలు జరిగితే తప్పేమిటని ప్రశ్నిస్తున్న టీడీపీ శ్రేణులు
సినిమా అనేది వినోదం పంచే వేదిక. ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో ఈనాడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తదితర వేదికల ద్వారా ఎక్కడేం జరిగినా, రికార్డులు, సరికొత్త అంశాలన్నీ యావత్ ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. అందులో సినిమా రికార్డులు కూడా ఉన్నాయి. రేసు గుర్రం మొదలు రుద్రమదేవి.. లెజెండ్, బాహుబలి తదితర సినిమాలన్నీ ఆడిన తీరు.. వాటిలో గొప్పతనం అందరికీ తెలుసు. కానీ వివాదాస్పదంగా మారిన నంది అవార్డుల ఎంపికతో ఏపీ సర్కార్ ఇరుకున పడిందనడంలో సందేహం లేదంటే అతి శయోక్తి కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవకతవకలు జరుగలేదా? అని సందేహాలు లేవనెత్తుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు తాము చేస్తే తప్పేమిటన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ మూడేళ్ళ జ్యూరీలు అవార్డుల ఎంపికలో కొన్ని లోటుపాట్లు జరిగాయి. చారిత్రక కథా చిత్రాలు తెలుగులో రావడమే అరుదు కాబట్టి, నిర్మాణంలోని చిన్నాచితకా లోపాలను పట్టించుకోకుండా అలాంటి సినిమాలకు అవార్డులివ్వడం నంది అవార్డుల్లో మొదటి నుంచీ ఆనవాయితీయే. మూడు దశాబ్దాల తరువాత తెలుగులో వచ్చిన చారిత్రక కథకు, అందులోని తెలుగునేలను ఏలిన తెలుగు రాణి కథకు ఉత్తమ చిత్రాల విభాగంలో కనీసం జ్యూరీ అవార్డయినా ఇవ్వకపోవడం అక్షరాలా అన్యాయమే.
వివాదం మీడియా సమస్య అని జగపతిబాబు
అనధికారికంగా అవార్డుల ఎంపికపై నిరసన వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు అధికారికంగా వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అందులో ‘లెజెండ్' ప్రతి నాయకుడిగా అవార్డు అందుకున్న జగపతి బాబు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎంత దుర్బరంగా మారిందో అవగతమవుతూనే ఉన్నది. జగపతి బాబు ప్రతిస్పందన భిన్నంగా ఉన్నది. వివాదం అనేది ‘మీ (మీడియా)' సమస్య అది, దాంతో తనకు సంబంధం లేదని తేల్చేశారు. 2015 సంవత్సరానికి నంది అవార్డులు అందుకోనున్న నాగ చైతన్య, రాజేంద్ర ప్రసాద్ మీడియా ముందు ‘ఈ వివాదం'పై స్పందించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. స్పోర్ట్స్ బార్ ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్ కూడా దీనిపై ప్రతిస్పందించడానికి నిరాకరించారు. గమ్మత్తేమిటంటే జ్యూరీ కమిటీలో అల్లు అర్జున్ తండ్రి, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ కూడా సభ్యులే కావడం గమనార్హం.
విమర్శకులు సైతం తప్పుబడుతున్న వైనం ఇలా
అవార్డుల ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే ‘రుద్రమదేవి' సినిమాకు అవార్డు రాకపోవడంపై దర్శక నిర్మాత గుణ శేఖర్ ఒక లేఖ ట్వీట్ చేశారు. ఎంతో చారిత్రక కథా చిత్రానికి వినోద పన్ను రాయితీ ఇవ్వకుండా ఆ తరువాత వచ్చిన బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి'కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీ ఇవ్వడాన్ని తాను గతంలో ప్రశ్నించడం వల్లే ఇప్పుడు అవార్డుల్లోనూ ఇలా జరిగిందా? అని సందేహం వ్యక్తం చేశారు. దాంతో, రచ్చ కాస్తా మంటగా మారింది. బుల్లితెరపై బిగ్ డిబేట్లకు మంచి ముడిసరుకూ దొరికింది. అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం'కి అవార్డులు రాకపోవడాన్నీ, ‘రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్రకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడాన్నీ అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ఆ మరునాడు నిర్మాత బన్నీ వాసు మరో పోస్ట్ పెట్టారు. ‘అవార్డులు రావాలంటే మెగా ఫ్యామిలీ హీరోలు టీడీపీ ప్రభుత్వం నుంచి నటనలో మెలకువలు నేర్చుకోవాలి'అని మెగా అస్త్రం సంధించారు. మెగా ఫ్యామిలీకి నంది అవార్డుల్లో పదే పదే అన్యాయం జరుగుతోందనే సంగతి అటుంచితే, విశేష ప్రజాదరణ పొంది, ఆద్యంతం వినోదాత్మకంగా ఉండే ‘రేసుగుర్రం'కి ఆ కేటగిరీల్లో అవార్డు ఎందుకు ఇవ్వలేదని విమర్శ ఒకటైతే ‘రుద్రమదేవి'లోనూ అల్లు అర్జున్కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారన్న అభియోగాలను కొట్టి పారేయలేనివని, ఇదే విషయం వారి ప్రత్యర్థులు చెప్తున్నారు.
‘మనం'కు రాదని నాగార్జునకు ముందే తెలుసా?
ఇక, ఆబాలగోపాలాన్ని నవ్వించి, కోట్లలో వసూలు చేసిన ‘రేసుగుర్రం'ని పాపులర్ సినిమాగా అయినా అవార్డుల్లో పరిగణించకపోవడం విచిత్రం.‘ఎఫ్.డి.సి.' వర్గాలు అభ్యంతరం చెప్పినా, కమిటీల ఏర్పాటు మొదలు అవార్డుల ప్రకటన దాకా అన్నింటిలో ప్రమేయమున్న అధికార పార్టీకి చెందిన ఆ సినిమా పెద్దమనిషి వినలేదట! దాంతో, ఇప్పుడీ లేనిపోని తలనొప్పి వచ్చి పడిందని ‘ఎఫ్.డి.సి.' వర్గాలు ఆంతరంగికంగా వాపోతున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, తాజా అవార్డుల ప్రకటనలో లోటుపాట్లకు ప్రభుత్వ ప్రమేయం కన్నా, పరిశ్రమలోని వ్యక్తిగత స్నేహాలు.. వైషమ్యాలు కారణమయ్యాయి. పైగా, నంది అవార్డుల కమిటీలకు పెద్దమనిషిగా వ్యవహరించిన ఒక సినీ ప్రముఖుడి అనాలోచిత నిర్ణయంతొ ఆ లోపాలను సరిదిద్దే అవకాశం చేజారినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి అక్కినేని నాగేశ్వర్ రావు, ఆయన కుమారుడు నాగార్జున, మనుమడు నాగచైతన్య నటించిన ‘మనం' సినిమాలో సహాయ నటుడిగా ‘నాగ చైతన్య'కు అవార్డు ఇవ్వడం గమనార్హం. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య గల అవినాభావ సంబంధం ఎవరూ కొట్టి పారేయలేని అంశం. కానీ నందమూరి బాలక్రుష్ణకు, అక్కినేని నాగార్జున మధ్య విభేదాల వల్లే ‘మనం' సినిమాకు అవార్డు రాలేదన్న విమర్శలు ఫిల్మ్ నగర్ లోనే కాదు తెలుగు నాట హోరెత్తుతున్నాయి.
నందమూరి బాలయ్య కొసమెరుపు వ్యాఖ్యలు
వివాదాలపై అంతెత్తున ఎగిరి పడే ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్.. ఒక టీవీ చానెల్లో భిన్నంగా ప్రతిస్పందించారు. సినీ ప్రముఖుల ఆవేదన వ్యక్తం చేస్తుంటే అదంతా రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించేందుకు వెనుకాడలేదు. ఆ అవకాశం వచ్చి ఉంటే కుట్ర వెనుక ఎవరున్నారో జోస్యం చెప్పేవారు. కానీ చర్చలో పాల్గొన్న సినీ ప్రముఖుడు... సదరు కుట్ర కోణంపై విచారణ కమిటీని వేసేసి తేల్చి పారేయండి అని సూచించడంతో రాజేంద్ర ప్రసాద్ గొంతు మూగబోయింది. సైకిల్ అవార్డులనీ, పచ్చ అవార్డులనీ సోషల్ మీడియా ఏకిపారేస్తోంటే, సినీ పరిశ్రమలోనూ కొందరు ఇవే ఆరోపణలు చేస్తోంటే.. వస్తున్న ఆరోపణలకు కాస్తంతైనా చింతించాల్సిందిపోయి.. రాజకీయ కుట్ర.. అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో దాట వేసేందుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ప్రయత్నించడం గమనార్హం. 'సినీ పరిశ్రమ మీద అవగాహన లేదు. సినిమాలే చూడను.' అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చెప్పడం చూస్తోంటే, నంది వెనుక రాజకీయం, నంది వెనుక కుట్రకు నేపథ్యం అర్థమవుతూనే ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలయ్య స్పందిస్తూ చేయాల్సిందంతా చేసేశామని.. స్పందించేదేమీ లేదని పేర్కొనడం కొసమెరుపు.