చక్రం తిప్పిన చంద్రబాబు: నేతలకు నామినేటేడ్ పోస్టులు, నంద్యాలలో మంత్రులకు బాధ్యతలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది అధికార టిడిపి.
నంద్యాల:ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది అధికార టిడిపి. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహరచనచేస్తోంది.అయితే వైసీపీ కూడ టిడిపి ఎత్తులను చిత్తులు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.మరోవైపు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నామినేటేడ్ పదవులను భర్తీచేసింది టిడిపి. మాజీ మంత్రి ఫరూక్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టనున్నారు. ఈ ఎన్నికలకోసం టిడిపి చీఫ్ చక్రంతిప్పుతున్నారు. ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందని టిడిపి నాయకత్వం భావిస్తోంది.ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది.
అయితే టిడిపి నుండి ఇటీవలే వైసీపీలో చేరిన మాజీమంత్రి శిల్పామోహన్రెడ్డిని ఈ స్థానం నుండి బరిలోకిదింపింది ఆ పార్టీ.శిల్పామోహన్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా టిడిపిని ఇబ్బందిపెట్టేదిశగా వైసీపీ పావులు కదిపింది.
దరిమిలా మారిన రాజకీయపరిస్థితుల నేపథ్యంలో టిడిపి , వైసీపీలు కూడ తమ వ్యూహలను మార్చుకొంటున్నాయి. ఏ వ్యూహన్ని అనుసరిస్తే గెలుపుసాధిస్తామో ఆ వ్యూహన్ని అనుసరిస్తున్నాయి.
నంద్యాలలో లోకేష్ పర్యటన
ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఐటీశాఖమంత్రి నారాలోకేష్ ఈ నెల 13వ, తేదిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ ఉపఎన్నికను టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. దీంతో మంత్రులు, పార్టీ నేతలను ఈ నియోజకవర్గంపై కేంద్రీకరిస్తున్నారు. పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.
Recommended Video
ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నామినేటేడ్ పదవులు
నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలువురు నేతలకు టిడిపి నాయకత్వం నామినేటేడ్ పోస్టులను కట్టబెట్టింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వర్గం ఓట్లను రాబట్టుకొనేందుకుగాను టిడిపి పావులు కదుపుతోంది. మాజీమంత్రి ఎన్ఎండి ఫరూక్కు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. మాజీ మున్సిఫల్ చైర్మెన్ నౌమాన్కు పదవులను కట్టబెట్టింది. నౌమాన్ వారంరోజుల క్రితమే టిడిపి తీర్థంపుచ్చుకొన్నారు. ఆయనను ఉర్ధూ అకాడమీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టింది.
సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకొనేందుకు వ్యూహం
నంద్యాల అసెంబ్లీ స్థానంలో మెజారిటీగా ఉన్న ఓటర్లను ఆకట్టుకొనేందుకుగాను టిడిపి వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. నంద్యాల పట్టణంలో సుమారు 26వేలకు పైగా ఆర్యవైశ్యులకు చెందిన ఓట్లున్నాయి. అయితే వీరిని ఆకర్షించేందుకుగాను మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు టిజి వెంకటేష్ను టిడిపి రంగంలోకి దింపింది. ఈ నెల 10వ, తేదిన టిజి వెంకటేష్ నేతృత్వంలో ఆర్యవైశ్యుల ర్యాలీని నిర్వహించారు.దీనికితోడు ఇప్పటికే నంద్యాల అసెంబ్లీ నియోజకర్గప్రచారం బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఈ నియోజకవర్గానికి కేటాయించిన నేతలంతా కేంద్రీకరించి పనిచేస్తున్నారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, ఏపీఎస్ఐడిసీ ఛైర్మెన్ కేఈ ప్రభాకర్, కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి , నేతలు ఏవీ సుబ్బారెడ్డి, ఎస్.శ్రీధర్రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గోస్పాడు మండలంలో మంత్రి అఖిలప్రియ, భూమా బ్రహ్మనందరెడ్డి ఇంటింటికి ప్రచారం చేశారు.
నంద్యాలలో అభివృద్ది పనులు
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి వందలకోట్ల అభివృద్ది పనులను నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగి బరిలో ఉన్న భూమానాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హమీలను అమలుచేసేందుకుగాను మంత్రి అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు గతనెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఈ పనులకు శంకుస్థాపన చేయించారు.దీనికితోడుగా ఇతర పనులను కూడ మంత్రులు ప్రారంభించారు. మంత్రులు, నేతల పర్యటనలతో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.