భూమా-శిల్పా మోహన్ రెడ్డిలో ఆ భయం: యువతకు 'స్మార్ట్'గా గాలం
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత వైయస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారంతో ప్రచారం ముగియనుంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత వైయస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారంతో ప్రచారం ముగియనుంది.
ఇప్పటికే నేతలు ఆయా సామాజిక వర్గం నాయకులతో భేటీ అయ్యారు, భేటీ అవుతున్నారు. ఎవరినీ వదిలి పెట్టకుండా.. అందరి పైన ఇరు పార్టీలు కన్నేశాయి. చంద్రబాబు, జగన్లు ఉప ఎన్నికను ప్రతిష్టగా తీసుకున్నారు.
నంద్యాలలో ఏం జరుగుతోంది: జగన్కు ఢిల్లీ మద్దతు ఉందా?
ఓట్ల చీలిక భయం
నంద్యాల ఉపఎన్నికలో ఓట్ల చీలిక అంశం టిడిపి, వైసిపి అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం పదిహేను మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా టిడిపి, వైసిపి మధ్య పోరు సాగుతోంది. 2014 ఎన్నికల్లో నంద్యాలలో ఇతర పార్టీల అభ్యర్థులందరికీ కలిపి 15,352 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇప్పుడు కూడా బరిలో పదిహేను మంది
వీరిలో వివిధ పార్టీల తరపున పదిమంది, ఐదుగురు స్వతంత్రులు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో 3,604 ఓట్ల మెజారిటీతో భూమా నాగిరెడ్డి గెలుపొందారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ 15మంది అభ్యర్థులే బరిలో నిలిచారు. వీరిలో స్వతంత్రులు ఆరుగురు, తొమ్మిది మంది వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్నారు.
ఎవరి లెక్కలు వారివి
గత ఎన్నికల్లో టిడిపి, వైసిపి మినహా స్వతంత్రులు, ఇతర పార్టీల వారికి వచ్చిన ఓట్లలో అత్యధికంగా ఎస్పీడీపీఐ అభ్యర్థికి 6,091 వచ్చాయి. ఈసారి వారు బరిలో లేనందున ఈ ఓట్లు ఎవరో ఒకరికి మళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఓట్ల చీలికపైనా పార్టీలు దృష్టి సారించాయి. ఈసారి ఇతర పార్టీలు ఎక్కువగా ఓట్లు చీల్చుకుంటే ఎవరికి నష్టం ఏర్పడుతుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
మూడొంతులకు పైగా యువతే
ప్రధాన సామాజికవర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై లెక్కలు వేస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములను యువ ఓటర్లు ప్రభావితం చేయనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా వీరిలో దాదాపు 38శాతం మంది యువతే.
స్మార్ట్ ఫోన్లతో వారికి గాలం
ఈ నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు టిడిపి, వైసిపిలు ప్రణాళికలు రచించుకున్నాయి. యువ ఓటర్లు ఎక్కువగా వినియోగించే స్మార్ట్ ఫోన్ల ద్వారా వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. యువత ఫోన్ నంబర్లు తీసుకొని, వాటప్స్, ఫేస్బుక్ల్లో ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు.