నిత్యపెళ్లికూతురు: ఒకరికి తెలియకుండా మరొకరితో, మూడు పెళ్లిళ్లు, భారీగా డబ్బులు డిమాండ్
కర్నూలు: ఇటీవల కాలంలో నిత్య పెళ్లికూతుళ్లు పెరిగిపోతున్నారు. తాజాగా, నంద్యాల జిల్లాలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువతి గుట్టురట్టయింది. ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లిళ్లు చేసుకుంది. అంతేగాక, ఎవరికీ కూడా ఆమె విడాకులు ఇవ్వలేదు. మూడో భర్తను కట్నం కోసం వేధించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
ఒకరికి తెలియకుండా మరొకరితి పెళ్లి చేసుకున్న జసింట
వివరాల్లోకి వెళితే.. నందాల మండలం మిట్నాలకు చెందిన మేరీ జసింటా అలియాస్ మేరమ్మ కూతురు జసింట అలియాస్ శిరీష(24)కు మొదటిసారి అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లిఖార్జునరావుతో వివాహమైంది. అతనికి విడాకులు ఇవ్వకుండానే.. ఆత్మకూరు మండలం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.
మూడో పెళ్లి చేసుకుని డబ్బులు డిమాండ్ చేసిన శిరీష
ఆ తర్వాత రెండో భర్తతో విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంకు చెందిన మహేశ్వర రెడ్డిని పెళ్లికి సిద్ధమైంది. మహేశ్వర రెడ్డికి కూడా రెండో పెళ్లి కావటంతో తనకు సెక్యూరిటీగా రూ. 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో మహేశ్వరరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె పేరుతో రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. అనతరం వారిద్దరూ ఫిబ్రవరి 5వ తేదీన మద్దిలేటి స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
తల్లీకూతుళ్ల గుట్టురట్టు.. పోలీసులకు మూడో భర్త ఫిర్యాదు
ఇక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. కొంతకాలం తర్వాత శిరీష తల్లి మేరమ్మ తరచూగా ఆర్ఎస్ రంగాపురం వస్తూ తన కూతురుని అత్తారింట్లో ఉంచాలంటే మరిన్ని డబ్బులు, కొంత ఆస్తి రాయాలని డిమాండ్ చేయటం ప్రారంభించింది. పెళ్లికి ముందు రూ.5 లక్షలు డిపాజిట్ చేశాను... మళ్లీ ఈ కొత్త ప్రతిపాదన ఏంటని అనుమానం వచ్చిన మహేశ్వర రెడ్డి శిరీష గురించి ఆరా చేయగా ఆమెకు ఇప్పటికే రెండువివాహాలు అయిన తెలిసి షాకయ్యాడు. వెంటనే తల్లీకూతురుపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.