భార్యా బాధితులే ఎక్కువ, ఇవే సాక్ష్యాలు: నన్నపనేని సంచలనం
అమరావతి: ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం భార్యా బాధితుల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. మహిళా కమిషన్కు మహిళలపై జరిగే గృహహింస కేసుల కన్నా 'భార్యా బాధితులవే' ఎక్కువయ్యాయని చెప్పారు.
తప్పుడు ఫిర్యాదులెక్కువయ్యాయి..
అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై గృహహింసకు సంబంధించి తమకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులు కూడా ఉంటున్నాయని నన్నపనేని చెప్పారు. తమపై కూడా తమ భార్యలు హింసకు దిగుతున్నారని, తమకు న్యాయం చేయాలంటూ పలువురు పురుషుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు.
పురుషులు గోడు వెళ్లబోసుకుంటున్నారు..
తమది మహిళా కమిషన్ కనుక వాటిని స్వీకరించి విచారించే అధికారం తమకు లేదని చెబుతున్నా... పలువురు తమ గోడు వెళ్లబోసుకొనేందుకు కమిషన్ వద్దకు వస్తున్నారని నన్నపనేని అన్నారు. తాము తిరస్కరిస్తున్న ఫిర్యాదులను తిరిగి వారి తల్లి ద్వారానో, చెల్లెల ద్వారా ఇప్పిస్తున్నారని తెలిపారు.
భార్య బాధితులే..
తమ కుమారుడిని భార్య వేధిస్తోందని వారితో ఫిర్యాదులు చేయిస్తున్నారని చెప్పారు. మహిళల ద్వారా అందుతున్న ఆ ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఓ మహిళ తమ కమిషన్ను కలిసి తనను భర్త వేధిస్తున్నాడని, తన చేతులపై గాయాలు చేశారని చూపించింది. తాము ఫిర్యాదును స్వీకరించి విచారిస్తే ఆమె చేతులకు ఉన్న గాయాలను తనకు తాను గాజులను పగులగొట్టుకోవడం వల్ల అయ్యాయని తేలిందని నన్నపనేని రాజకుమారి తెలిపారు.
పురుషులే నష్టపోతున్నారు..
తమకు మాత్రం తన భర్తే తన రెండు చేతులను కొట్టి గాయపర్చినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఆమె కుమార్తె స్వయంగా తన తల్లే గాజులు పగులగొట్టుకున్నట్లు తెలిపిందని వివరించారు. మరో కేసులో ఎన్ఆర్ఐ భర్త తనను వేధించాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. కానీ, ప్రాథమిక విచారణ చేయించి కేసు పెట్టించామని, దాంతో అతను అరెస్టు అయ్యాడన్నారు. ఆ తర్వాత లోతుగా విచారస్తే అతని తప్పులేదని తేలిందని, అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం అతనికి జరిగిపోయిందని అన్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో గృహహింస కేసుల్లో చాలా అప్రమత్తంగా, లోతుగా విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.