నారా లోకేష్ సహా మాజీ మంత్రుల అరెస్ట్: గుంటూరులో ఉద్రిక్తత, టీడీపీ, వైసీపీ శ్రేణుల తోపులాట
గుంటూరు: ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లారు. ఆయనతోపాటు పలువురు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు ఉన్నారు. అయితే, రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ ఇక్కడికి వచ్చారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో పరమయ్యగుంట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నారా లోకేష్ సహా మాజీ మంత్రుల అరెస్ట్, ఉద్రిక్తత
ఈ క్రమంలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు, ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రయత్నించారు. బాధితురాలు రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం నారా లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ వెంట వచ్చిన మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి మరోసారి కొంత ఉద్రిక్తంగా మారింది. లోకేష్ను ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. మిగితా నేతలను ఇతర పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు.

రమ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్, జగన్ సర్కారుపై ఫైర్
గుంటూరు నగరంలోని పరమయ్యగుంటలో హత్యకు గురైన రమ్య ఇంటికి వెళ్లిన నారా లోకేష్ ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని నారా లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. తాను బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తే ప్రభుత్వానికి ఎందకంత ఉలుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాలు ఆగడం లేదని మండిపడ్డారు. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు.

జీజీహెచ్ ఆస్పత్రి విపక్షాల ఆందోళన, ఉద్రిక్తత
ఇది ఇలావుండగా, సోమవారం రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్లో పోస్టుమార్టం పూర్తయింది. దీంతో రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అప్పటికే జీజీహెచ్ వద్దకు చేరుకున్న టీడీపీ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా అడ్డుకుని.. హంతకుడికి కఠినంగా శిక్షించాలని భారీ ఆందోళన నిర్వహించారు.

జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత, ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలంటూ వివిధ రాజకీయ పార్టీల నేతలు జీజీహెచ్ వద్ద ధర్నాకు దిగారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో రమ్య మృతదేహాన్ని మరో మార్గం గుండా తరలించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి ఆమె ఇంటికి తరలించారు. విపక్షాల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్య దారుణ హత్య
కాగా, ఆదివారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతండగా రమ్య(20)ను శశికృష్ణ(24) అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరు వద్ద ఆదివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పట్టపగలే అందరూ చూస్తుండగానే నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన ఒక్కరిద్దరిని కత్తితో బెదిరించడంతో మిగితావారెవరూ ముందుకు రాలేదు. దీంతో దాడి చేసి అక్కడ్నుంచి పరరాయ్యాడు.

నిందితుడు శశికృష్ణ అరెస్ట్.. కఠినంగా శిక్షించాలని జగన్ ఆదేశం
రమ్య హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. రమ్య హత్య కేసు దర్యాప్తు ను వేగవంతం చేయాలని, దిశ చట్టం కింద చర్యలు తీసుకుని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. కాగా, నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్టూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని హత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications