వాట్సాప్ సేవల పేరుతో డేటా చోరీ? లోకేష్ 10 కోట్ల సవాల్..!
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ లో ఒక్క క్లిక్ తో 161 సేవల్ని అందిందే విధంగా మెటాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో తొలి విడతలో 161 సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వీటిని 500 సేవలకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాట్సాప్ సేవల పేరుతో కస్టమర్ల డేటా చౌర్యానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని విపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో స్పందించారు.
వాట్సాప్ లో పౌర సేవల్ని అందుబాటులోకి తెస్తే డేటా చౌర్యం పేరుతో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మాట్లాడారు. ఎక్కడైనా డేటా చౌర్యం జరిగిందని నిరూపిస్తే 10 కోట్లు కానుకగా ఇస్తానని లోకేష్ ప్రకటించారు. అంతే కాదు ఈ మొత్తం ప్రభుత్వం నుంచి కాకుండా తన సొంత డబ్బులు చెక్ రూపంలో ఇస్తానని సవాల్ చేశారు. వాట్సాప్ ద్వారా డేటా చౌర్యం జరుగుతోందన్న ఆరోపణలు నిరూపించాలని వైసీపీ నేతలకు ఆయన ఛాలెంజ్ చేశారు.

వాట్సాప్ గవర్నెన్స్ పై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో నారా లోకేష్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పౌర సేవల్ని అన్ని ప్లాట్ పామ్స్ పై తీసుకురావాలని ఆయన సూచించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వైష్ణవ్ సూచన మేరకు త్వరలో డిజీ లాకర్ లో అన్ని సర్టిఫికెట్లు దాచుకునేలా మరో ఒప్పందం చేసుకోబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో చాలా ప్రభుత్వాలు వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించడంపై ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు గతంలో విపక్ష నేతగా ఉండగా చంద్రబాబును చేయని తప్పుకు 52 రోజులు జైల్లో పెట్టిన వాళ్లు.. ఇప్పుడు ఐటీ మంత్రిగా తాను తప్పు చేస్తే ఊరుకుంటారా అని లోకేష్ ప్రశ్నించారు. తమకు వైసీపీలా ప్రజల డేటా అక్కర్లేదని లోకేష్ తెలిపారు. తమకు ఓటర్ లిస్ట్ చాలని, అది కూడా పబ్లిక్ డాక్యుమెంటేనని లోకేష్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications