పెద్దాయనంటూ పవన్కు నారా లోకేష్ సవాల్: ‘ట్రైలరే’నంటూ బీజేపీ, జగన్ పార్టీలను ఏకేశారు
విశాఖపట్నం: కేంద్రం నమ్మద్రోహం చేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభలో లోకేష్ ప్రసంగించారు. ఏపీకి నిధులిస్తామని సీఎం చంద్రబాబును 29సార్లు తిప్పుకుందని అన్నారు.
ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి, ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని లోకేష్ ప్రశ్నించారు. 16వేలకోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడినా.. ఏ లోటు లేకుండా ఏపీని చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. 24వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, 24గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.
బీజేపీకి ఇది ట్రైలర్ మాత్రమే
బీజేపీ కుళ్లు రాజకీయాలు చేస్తోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. తమిళనాడులో బీజేపీ నాయకులను తరిమికొట్టారని, కర్ణాటకలో కాళ్లు విరగ్గొట్టారని అన్నారు. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఇచ్చిన పిలుపుమేరకు తెలుగువారు స్పందించారని అన్నారు. తెలుగువాళ్లు కర్ణాటకలో ట్రైలర్ చూపించారని, 2019లో అసలైన సినిమా చూపించబోతున్నారని లోకేష్ అన్నారు.
Recommended Video
మోడీ.. జగన్తోనా?
12 కేసుల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయని, అలాంటి వ్యక్తితో బీజేపీ ఎలా ముందుకు పోతోందని ప్రశ్నించారు.420 జగన్ ఖైదీ నెంబర్ 6093 అని లోకేష్ చెప్పారు. అవినీతికి వ్యతిరేకమని చెప్పిన మోడీ.. జగన్తో ఎట్లా కలుస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.
బీజేపీ, వైసీపీ తెరవెనుక కుట్రలు
టీడీపీని దెబ్బతీయాలంటే డైరెక్టుగా రావాలని, ఇలా వెనుక నుంచి కుట్రలు చేస్తే మూల్యం చెల్లించుకుంటారని బీజేపీని హెచ్చరించారు. వైసీపీకి కూడా గుణపాఠం తప్పదని అన్నారు. బీజేపీ, వైసీపీ క్విడ్ ప్రోకో రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం కోసం వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు చేసిందని లోకేష్ అన్నారు.
ఓ పెద్దాయనంటూ పవన్కు సవాల్
ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఓ పెద్దాయన ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా తప్పు చేశాననో ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. మరో 40ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, ఎలాంటి తప్పులు చేయనని అన్నారు. ఎన్టీఆర్ అంత మంచి పేరు తెచ్చుకోకున్నా.. చెడ్డపేరు మాత్రం తెచ్చుకోననని అన్నారు.
కాంగ్రెస్కు పట్టిన గతే..
2014లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని అన్నారు. 25ఎంపీలను గెలిపిస్తే హోదా వస్తుందని, హామీల అమలు జరుగుతుందని అన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు. టీటీడీ జోలికొస్తే మూల్యం చెల్లించుకుంటారని లోకేష్ అన్నారు. టీటీడీని చంద్రబాబు కాపాడుతున్నారని అన్నారు.