ప్రధాని మోడీతో లోకేష్ భేటీ- రాజకీయ చర్చ సహా అజెండాలో ఇవే..!
ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ముందుగానే ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకున్న లోకేష్ ఇవాళ ఉదయం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధానితో పలు కీలక అంశాలపై లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవాళ ఉదయం ఒంటరిగానే వెళ్లి ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో మంత్రి లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి మంత్రి లోకేష్ అందజేశారు. అలాగే విద్యారంగ వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధాని మోడీకి మంత్రి నారా లోకేష్ వివరించారు. అమరావతి విషయంలో సింగపూర్ వైఖరి ఎలా ఉంది, రాజధాని మినహా మిగిలిన ప్రాజెక్టుల్లో సహకారానికి సింగపూర్ ఇచ్చిన హామీ వంటి విషయాలు చర్చకు వచ్చాయి. కేంద్రం వైపు నుంచి కూడా రాష్ట్రానికి అవసరమైన సాయం అందించాలని లోకేష్ కోరారు. అలాగే ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్జతలు తెలిపారు.
మరోవైపు రాజకీయ చర్చలో ఏపీ లిక్కర్ స్కాంపై చర్చించి ఉండొచ్చని తెలుస్తోంది. లిక్కర్ స్కాంపై త్వరలో సిట్ మరో ఛార్జిషీట్ దాఖలు చేయబోతోంది. ఇందులో వైఎస్ జగన్ పేరు కూడా నిందితుడిగా చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రధానికి లోకేష్ సమాచారం ఇచ్చి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. రేపు జగన్ ను అరెస్టు చేయాల్సి వచ్చినప్పుడు దీనిపై కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పుకునేందుకే ఈ వ్యవహారంపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటసేపు జరిగిన భేటీ తర్వాత లోకేష్ తిరిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications