ఏపీకి నామం, సొంత జిల్లాకూ అన్యాయం చేస్తావా?: జగన్కు లోకేష్ సవాల్
కడప: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శనివారం కడపలో ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ను ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు లోకేష్ కూడా పరామర్శించారు.
ఏపీకీ నామం పెట్టారు
అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు దీక్షలు చేస్తుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో రాజీపడి ఏపీకి నామం పెట్టారని అన్నారు. వైసీపీ ఎంపీలు ఏనాడైన ఉక్కు పరిశ్రమ కోసం పోరాడారా? అని ప్రశ్నించారు.
జగన్కు లోకేష్ సవాల్
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబుపై ఆరోపణలు చేస్తారా? అని వైసీపీ నేతలను లోకేష్ నిలదీశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే.. ప్రధాని మోడీని విమర్శించాలని.. సవాల్ విసిరారు.
జగన్.. సొంత జిల్లాకు అన్యాయం చేస్తారా?
జగన్ పార్టీ డ్రామాకలు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్క్రిప్టు రాస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు. సొంత జిల్లాకు జగన్ ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రధాని.. బాబే నిర్ణయిస్తారు
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని, నాలుగేళ్లు ఓపిక పట్టామని, అయినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చెందిన 25మంది ఎంపీలను గెలిపిస్తే.. ప్రధానిని చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని డిమాండ్లను సాధిస్తామని లోకేష్ చెప్పారు.