టీడీపీ: జూ.ఎన్టీఆర్తో పోటీపడ్డ లోకేష్.. బాబుకి భిన్నంగా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ క్రమంగా పార్టీ పైన పట్టు సాధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహానాడు వేదికగా లోకేష్ రంగ ప్రవేశం చేశారు. ఓ వైపు చంద్రబాబు పాలన పైన దృష్టి సారిస్తుంటే.. లోకేష్ పార్టీ పైన పట్టు సాధిస్తున్నారు. లోకేష్ తెలంగాణ పైన కూడా దృష్టి సారించారు. మాసాయిపేట రైలు ప్రమాద బాధితులను ఆయన స్వయంగా కలుసుకొని చెక్కులు అందించారు.
ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం లోకేష్ కసరత్తు కూడా చేస్తున్నారట. లోకేష్ నిత్యం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వస్తున్నారు. బాబు చాంబర్ ఎదురుగా ఆయనకు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. లోకేష్ను కలుసుకునేందుకు చాలామంది వస్తుండటంతో ఇరుకుగా ఉన్న ఈ కార్యాలయాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. కార్యకర్తలు, నేతలు నిత్యం తనను కలుసుకునేందుకు లోకేష్ అనుమతిస్తున్నారట. నిత్యం కార్యకర్తలతో చర్చించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

ఎన్నికలకు ముందు టీడీపీలో వారసత్వ పోరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ అలక వహించినట్లుగా వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ల మధ్య వారసత్వ పోరు కనిపించింది. హరికృష్ణ జూనియర్ను చంద్రబాబుకు వారసుడిగా తీసుకు వచ్చేందుకు విఫలయత్నం చేశారు. అయితే, దీనిని గమనించిన చంద్రబాబు అప్పటికి వారసత్వ పోరును పక్కన పెట్టేశారు.
ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో.. మహానాడు వేదికగా లోకేష్ ఆరంగేట్రం చేశాడు. తద్వారా భావి వారసుడు జూనియర్ కాదని, లోకేష్ అని తేటతెల్లమైంది. ఎన్నికల అనంతరం లోకేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీ పైన పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, చంద్రబాబుకు భిన్నంగా ఆయన పని తీరు సాగుతోందని అంటున్నారు. లోకేష్ మీడియా హడావుడి లేకుండా తన పని చేసుకు పోతున్నారంటున్నారు.
ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు, యువనేతలు లోకేష్ వద్దకు క్యూ కడుతున్నారట. భావి నేత లోకేష్ అని తేలినందువల్ల, చంద్రబాబు పాలనలో బిజీగా ఉండటం వల్ల యువనేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. మరోవైపు, లోకేష్.. చంద్రబాబు వద్ద ఓఎస్డీగా తన మనిషిని ఉంచారట.












Click it and Unblock the Notifications