జే ట్యాక్స్ తో తరలుతున్న పరిశ్రమలు - మీ అనుభవ లేమితో విద్యుత్ కొరత : సీఎంకు లోకేష్ లేఖ..!!
ఇప్పటికైనా ఉన్నతాధికారులతో సమీక్షించి పవర్ హాలీడేని ఎత్తేసే మార్గం ఆలోచించమని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాసారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. పవర్ హాలిడే పాటించాలనే ఆదేశాలతో అన్నిరంగాలు సంక్షోభంలోకి నెట్టివేసినట్లయిందని లేఖలో పేర్కొన్నారు. పవర్లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే..కానీ, ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా అంటూ లోకేష్ ప్రశ్నించారు. కరెంటు చార్జీలు ఒక్కసారి కూడా పెంచని టిడిపి ప్రభుత్వంపై.. ఎంతెంత బిల్లులు వేస్తారంటూ అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.

మూడేళ్లల్లో ఏడు సార్లు ఛార్జీల పెంపు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ లేఖలో వివరించారు.తమ ప్రభుత్వ పాలనలో ఏనాడు విద్యుత్ కోతలు లేవన్నారు. మీరు సీఎం అయిన తరువా విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారంటూ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మీ అవగాహనారాహిత్యం, అనుభవలేమితో విద్యుత్ కొరత ఏర్పడి ఏకంగా పరిశ్రమలకు పవర్హాలీడే ప్రకటించే వరకూ దారి తీసిందని లేఖలో ప్రస్తావించారు. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పులకు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విలవిల్లాడుతున్నాయని వివరించారు.

మూత దిశగా పరిశ్రమలు
వైపు కరెంటు కోతలు, మరోవైపు ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో అధికంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వల్ల జనరేటర్లు నడపలేక కుటీర, చిన్న పరిశ్రమల నుంచీ పెద్ద పరిశ్రమల వరకూ అన్నీ మూత దిశగా సాగుతున్నాయని లోకేష్ తన లేఖలో చెప్పుకొచ్చారు. పారిశ్రామిక రంగానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో కొత్తగా ఒక్క పరిశ్రమ రాకపోగా వైసీపీ నేతల వేధింపులు, జే ట్యాక్స్ ఇప్పుడు ఈ పవర్ హాలీడేతో ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నాయంటూ లేఖలో విమర్శించారు. రాయితీలు లేకపోవటం, పెరిగిన విద్యుత్ చార్జీలు, పన్నులు బాదుడుతో ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయని లోకేష్ పేర్కొన్నారు.

పవర్ హాలిడే ఎత్తివేయండి
వేసవికాలంలో విద్యుత్కి అధిక డిమాండ్ వుంటుందనే కనీస ఆలోచన లేకుండా విద్యుత్ ఉత్పత్తి - డిమాండ్పై అంచనాలు కూడా వేయకుండా..కోతలు మొదలయ్యాక కరెంటు కొంటామంటూ ప్రకటనలు ఇవ్వటాన్ని లోకేష్ తప్పు బట్టారు. వారంలో ఉన్న సెలవుకి తోడు మీరు ప్రకటించిన పవర్ హాలీడ్, కరెంట్ కోతలతో ఉపాధి కోల్పోయి కార్మికులు రోడ్డునపడుతున్నారన్నారు. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెను భారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీ ని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు దోచుకునే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోని కొన ఊపిరితో వున్న పరిశ్రమలని కాపాడండంటూ లోకేష్ ఆ లేఖలో సీఎం జగన్ ను కోరారు.












Click it and Unblock the Notifications