లోకేష్ పోటీ ప్రభుత్వం : మంగళగిరి కేంద్రంగా : తాజాగా మరో కీలక నిర్ణయం..!!
టీడీపీ నేత నారా లోకేష్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. తాను ఎక్కడైతే ఓడానో అక్కడే తిరిగి నిలబడి నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా పోటీ ప్రభుత్వం నడుపుతున్నారు. తన నియెజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నా..పోటీగా తన సొంత నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాజకీయంగా వైసీపీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆర్కే చేతిలో ఓడిపోయారు. వైసీపీ నేతలు ఈ ఓటమి గురించి పదే పదే ప్రస్తావిస్తూ..ఎద్దేవా చేసారు.
మంగళగిరిలో సొంత నిధులతో
ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో రెండు సార్లు వరుసగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రాజకీయంగా గతంలో కనిపించినంత యాక్టివ్ గా లేరనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేయగా.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యల పైన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతీ గ్రామంలోనూ వైఎస్సార్ క్లినీక్స్ తీసుకువస్తోంది. ఈ సమయంలోనే లోకేష్ దీనికి పోటీగా మరో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
పేద ప్రజలకు దగ్గరయ్యేందుకు
తన సొంత నిధులతో సంజీవని ఆరోగ్యకేంద్రాలు - రధాలను ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున లోకేష్ వీటిని ప్రారంభించనున్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వాహనంలో ఒక జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఉంటారు. డాక్టర్ ఆధ్వర్యంలో రోగుల్ని పరీక్షిస్తారు. ఈ ఆరోగ్యరథం వద్దే 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు. అవసరమైనవారికి మందులు కూడా రూపాయి తీసుకోకుండా అందజేయనున్నారు.
ప్రభుత్వానికి పోటీగా కార్యక్రమాలు
అందరికీ ఆరోగ్యమస్తు-ప్రతీ ఇంటికీ శుభమస్తు అనే నినాదంతో వీటిని నిర్వహించనున్నారు.ఇందులో పేషెంట్లకి అత్యవసరసేవలు అందించే సామగ్రి, నెబ్యులైజర్, ఆక్సిజన్ వంటివన్నీ అందుబాటులో వుంటాయి. త్వరలోనే నియెజకవర్గ పరిధిలోని త్వరలో మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లిలో సంజీవని ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజల ముందుకే సంజీవని రథాలను తీసుకెళ్లటం ద్వారా స్థానిక ప్రజలకు మరింత దగ్గరయ్యేందకు లోకేష్ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు.