వీడియో పోస్ట్ చేసి .. జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ నయం అంటున్న నారా లోకేష్
ఏపీ సీఎం జగన్ పై, వైసిపి మంత్రులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని విమర్శిస్తున్న లోకేష్, అనంతపురం జిల్లాలో పర్యటించిన మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేయడంపై సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే
మంత్రి బొత్సాకు విద్యార్ధి సంఘాల నుండి నిరసన సెగ
అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అపార నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా ప్రజలు వర్షాల ధాటికి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అనంతపురం జిల్లా రైతులు వరదలకు పంట నష్టపోయి తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అనంతపురం జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించడానికి వచ్చిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఊహించని విధంగా విద్యార్థి సంఘాల నుండి నిరసన సెగ తగిలింది. వరద నష్టం పై సమీక్ష సమావేశం ముగించుకుని వెళ్తున్న మంత్రిని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల కోసం విద్యార్ధి సంఘాల ఆందోళన, పోలీసులు అరెస్ట్
వరదలతో పంట దెబ్బతిన్న రైతులు మంత్రి బొత్సా సత్యన్నారాయణను కలవాలని ప్రయత్నం చేసినా, వారిని కలవకుండా మంత్రి వెళ్లిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంత్రి కారును అడ్డుకున్నారు.
ఇక ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలకు మంత్రి సమాధానం చెప్పకపోవడంతో విద్యార్థులు మంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
విద్యార్ధి సంఘాల నాయకులను అరెస్ట్ చెయ్యటం పై మండిపడిన లోకేష్
ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ ను అడ్డుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడమే విద్యార్థి సంఘాల నేతలు చేసిన భయంకరమైన నేరమన్నట్టు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం పరిష్కారించదని, ఇక ప్రశ్నించే ప్రజా విద్యార్థి సంఘాలను అక్రమంగా అరెస్టు చేయిస్తారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కు ను హత్య చేసిన జగన్ రెడ్డి కంటే ఉత్తరకొరియా కిమ్ నయం అంటూ లోకేష్ పేర్కొన్నారు .
ప్రభుత్వోద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు
ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ పేర్కొన్న లోకేష్ కనీసం వారిని మనుషుల్లా కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు అవమానించిన తీరు బాధాకరంగా ఉందని, ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న పదహారు వందల కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని లోకేష్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే పిఆర్సి నివేదిక బహిర్గతం చేసి అమలుచేయాలని పేర్కొన్న లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చేయకుండా సి పి ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1,600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని నారా లోకేష్ పేర్కొన్నారు. పెండింగ్లో పెట్టిన 7 డిఏ లను వెంటనే ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.