చంద్రబాబుకే సాధ్యమైంది: లోకేష్ ప్రశంసలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్రమంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అప్పులతో మొదలు పెట్టినా అన్నీ హామీలు నెరవేరుస్తున్నామని లోకేష్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రికి కార్యాలయం వసతి కూడా లేకపోయినా బస్సులో ఉండే ఆరునెలల పరిపాలన సాగించింది ఒక్క చంద్రబాబుదే అని లోకేష్ చెప్పారు.
సాధ్యం చేసింది చంద్రబాబే
దేశంలో నదుల అనుసంధానం గురించి అందరూ మాట్లాడేవారే కానీ సాధ్యం చేసింది మాత్రం చంద్రబాబేనని లోకేష్ కొనియాడారు. దేశ వ్యాప్తంగా మరుగుదొడ్లు 36శాతం మందికి మాత్రమే ఉంటే ఆంధ్రప్రదేశ్లో 80శాతం మరుగుదొడ్లు పూర్తిచేశామన్నారు.
అందరికీ సురక్షిత నీరు
2018 డిసెంబర్ నాటికి అందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 2018 నవంబర్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అత్యుత్తమ రాష్ట్రంగా..
2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలవాలన్నది లక్ష్యమని లోకేష్ అన్నారు. ప్రతీ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు ప్రతిగ్రామానికి 10స్టార్ పాయింట్లు కేటాయిస్తున్నామన్నారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల ఆధారంగా వాటికి రేటింగ్లు ఇస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి ప్రశంసించారంటూ..
ప్రజలు అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా జన్మభూమి కార్యక్రమం తీసుకొచ్చామని లోకేష్ చెప్పుకొచ్చారు. అధికారులే మీ ముంగిటకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నర్స్ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రశంసించారని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు.