అమీర్ పేట కోచింగ్ సెంటర్లే బెటర్..! చేదు నిజం చెప్పిన లోకేష్..!
భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని, అయితే తాము 30 ట్రిలియన్ డాలర్లు లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ బృహత్తర లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలంటే ఉన్నత విద్యారంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమన్నారు. అమరావతిలో సీఐఐ సదరన్ రీజియన్, విట్-ఏపీ సంయుక్తంగా నిర్వహించిన 'హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ - 2025'కు లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునఃరూపకల్పన చేయడం అనే థీమ్తో ఈ సదస్సును ఏర్పాటు చేశారని, అయితే తాను ఈ అంశంతో పూర్తిగా ఏకీభవించడం లేదన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం మనకు అత్యంత సమీపంలో ఉందని, దానిని మనం సులభంగానే చేరుకుంటామని తెలిపారు. కానీ, అసలు ప్రశ్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదగాలన్నదే అన్నారు. మానవ వనరులు, మేధోసంపద లేకుండా ఇంతటి ఆర్థికవృద్ధి అసాధ్యమన్నారు. ఈ లక్ష్య సాధనలో ఉన్నత విద్యారంగమే వ్యూహాత్మక మూలస్తంభంలా పనిచేయాలన్నారు.

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నైపుణ్యాల కొరత అని లోకేశ్ తెలిపారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం మన గ్రాడ్యుయేట్లలో కేవలం 51 శాతం మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారని, ఇది మన యువత మేధస్సు లోపం కాదన్నారు. మనం బోధించే అంశాలకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అసమతుల్యతే దీనికి ప్రధాన కారణమన్నారు. మన విద్యాసంస్థల్లో 3-4 ఏళ్ల కోర్సులు పూర్తి చేసినా యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు.

కానీ హైదరాబాద్ అమీర్పేటలోని కోచింగ్ సెంటర్లు కేవలం 3-4 నెలల శిక్షణతోనే వారికి అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ అంతరాన్ని పూడ్చడానికే ఉన్నత విద్యలో ప్రాథమిక మార్పులు రావాలన్నారు. డిగ్రీలతో పాటు క్రియాశీల నైపుణ్యాలపై దృష్టి సారించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఏపీలో నైపుణ్యాల అంతరాన్ని (స్కిల్ గ్యాప్) భర్తీ చేసేందుకే సీఎం చంద్రబాబు నేతృత్వంలో తమ ప్రభుత్వం 'స్కిల్ సెన్సస్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని లోకేశ్ వెల్లడించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని తన నియోజకవర్గం మంగళగిరి నుంచే ప్రారంభించిందన్నారు.












Click it and Unblock the Notifications