ఆమెతోనే పెరిగా, ఆమెనే ప్రేమిస్తా.. దటీజ్ లోకేష్: లోకేష్, రూ.2వేల నోటుతో ప్రమాదం
చిత్తూరు: తాను, బ్రాహ్మణి కలిసి పెరిగామని, చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నామని, పెళ్లయి పదేళ్లయిందని, నేను అప్పుడు... ఇప్పుడు.. ఎప్పుడు ఆమెనే ప్రేమిస్తుంటానని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గురువారం అన్నారు.
ఆయన యువ చైతన్య యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
2014లో టిడిపి సభ్యత్వం ద్వారా ప్రమాద బీమాను తీసుకు వచ్చిందని, దీంతో తాము అధికారంలోకి వచ్చాక ప్రతి పౌరుడికి రూ.10 లక్షల బీమా ఉండాలనే ఉద్దేశ్యంతో చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు చలాకీగా ఉండేవాడినని చెప్పారు.
రూ.2వేల నోటుతో ప్రమాదం
రూ.500, రూ.1000 నోట్ల రద్దును తొలుత ప్రతిపాదించింది చంద్రబాబు, టిడిపియే అన్నారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అయితే, రూ.2వేల నోట్లను తీసుకు వచ్చారని, వీటి వల్ల మరీ ప్రమాదం అన్నారు. అందుకే దానిని కూడా వెనక్కి తీసుకోవాలంటున్నామన్నారు.
పాలు, కూరగాయలు అమ్మాను.. దటీజ్ లోకేష్
తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన అనంతరం పాలు, కూరగాయలు అమ్మానని చెప్పారు. హెరిటేజ్లో పని చేశానని చెప్పారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి రావడంలో తప్పు లేదని, మార్పు తీసుకు రావాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
నా కుటుంబమే రోల్ మోడల్
నాకు నా కుటుంబ సభ్యులే రోల్ మోడల్ అన్నారు. కంపెనీలో పని చేస్తూ డబ్బులు సంపాదించానన్నారు. దటీజ్ లోకేష్ అన్నారు. తన భార్య బ్రాహ్మణి కార్యాలయానికి వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదిస్తోందన్నారు.
ఎన్టీఆర్ తాత కావడం, చంద్రబాబు తండ్రి కావడం తన అదృష్టమన్నారు. వారు తన తాత, తండ్రులుగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని, వారిని ఆదర్శంగా తీసుకుంటానని, అలాగే మీతో సహా అందర్నీ ఆదర్శంగా తీసుకుంటానని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
కొన్ని విషయాల్లో తన తాత, కొన్ని విషయాల్లో తండ్రి, మరికొన్ని విషయాల్లో అమ్మ, ఇంకొన్ని విషయాల్లో తన భార్య బ్రాహ్మణి కూడా స్ఫూర్తి అన్నారు. అన్ని అంశాల ఫుల్ ప్యాకేజీ నారా లోకేష్ అని సరదాగా వ్యాఖ్యానించారు.