ఉద్యమానికి ఏడాది; 22మంది వైసీపీ ఎంపీలున్నారు.. విశాఖ ఉక్కుపై మాట్లాడలేరా: నారా లోకేష్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం నేటితో ఏడాది పూర్తయింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. నాటి నుండి నేటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
టీడీపీపై విషప్రచారం చెయ్యటం కొడాలి నాని పని; ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్ మీదే: బోండా ఉమ
వైసీపీ ఎంపీలను టార్గెట్ చేసిన నారా లోకేష్
తాజాగా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఏడాది పూర్తి కావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను అని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీలను టార్గెట్ చేసిన నారా లోకేష్ విశాఖ ఉక్కు పై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
గల్లీ నుండి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకూ టిడిపి నిరసన
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుండి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకూ టిడిపి నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉంది. కానీ వైసిపి ఎంపీలు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేక పోతున్నారని విమర్శించారు లోకేష్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్యమానికి అన్నివిధాలుగా అండగా నిలిచేందుకు ఉక్కు పరిరక్షణకు పునరంకితం అవుతుంది తెలుగుదేశం పార్టీ అని ఒక పోస్టర్ ను పోస్ట్ చేశారు లోకేష్.
22 మంది ఎంపీలు కలిగిన వైసీపీ విశాఖ ఉక్కు పై మాట్లాడలేదా?
22 మంది ఎంపీలు కలిగిన ఆ పార్టీ విశాఖ ఉక్కు పై మాట్లాడలేదా అంటూ నారా లోకేష్ వైసిపి ఎంపీలను టార్గెట్ చేశారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పాటై,వేలాది మందికి ఉపాధి కల్పతరువుగా మారిన విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం వైయస్ జగన్,వైసిపి ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేయడం బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం అని లోకేష్ తేల్చిచెప్పారు.
కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి రాకను నిరసిస్తూ సర్క్యూట్ హౌస్ వద్ద ర్యాలీ
ఇదిలా ఉంటే విశాఖలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి రాకను నిరసిస్తూ విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ వద్ద ర్యాలీ చేపట్టారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు, ఎన్నో వేల ఎకరాల భూములను ఇవ్వడం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయొద్దని పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ఆందోళన నిర్వహించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ బిజెపి ప్రభుత్వం సొత్తు కాదని ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఏడాది కాలంగా శాంతియుతంగా నిరసన చేపడుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వెనక్కి వెళ్లి పోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.