అందుకే ఐతే జగన్ దావోస్కు వెళ్లాలా?, సజ్జల, ద్వారంపూడితో ఆ ఎమ్మెల్సీ భేటీనా?: నారా లోకేష్ సవాల్
అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో తాజా పరిస్థితులను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై నమోదైన కేసులో లోకేష్ సోమవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం దావోస్ పర్యటన, వైసీపీ ఎమ్మెల్సీపై హత్య కేసు గురించి విమర్శలు ఎక్కుపెట్టారు.
ఏపీ రాజధానిపై దావోస్లో ఏం చెప్తారు జగన్: నారా లోకేష్
ఏపీ రాజధాని ఏదంటే దావోస్లో సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని నారా లోకేష్ ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అడిగితే సీఎం ఏమని వివరణ ఇస్తారన్నారు. దావోస్ లో వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉంది తప్ప పెట్టుబడుల కోసం జగన్ అక్కడికి వెళ్లినట్లు లేదని అన్నారు. దావోస్లో పారిశ్రామికవేత్తలు ఎవరూ జగన్ను కలవడానికి రావడం లేదని ఆరోపించారు.
అదానీని కలిసేందుకు జగన్ దావోస్కు వెళ్లాలా?: నారా లోకేష్
దావోస్లో గత 24 గంటల్లో జగన్ కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీయేనని.. ఆయనను కలిసేందుకు జగన్ దావోస్ కు వెళ్లడం దేనికని నారా లోకేష్ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన అదానీ కలుస్తారన్నారు. ప్రత్యేక విమానం కోసమే జగన్.. రూ. 8 కోట్లు ఖర్చు చేశారని లోకేష్ ఆరోపించారు. దావోస్ కు నేరుగా వెళ్లకుండా లండన్ ఎందుకు వెళ్లారని నారా లోకేష్ ప్రశ్నించారు.
కేసులకు భయపడేది లేదన్న నారా లోకేష్: జగన్కు సవాల్
ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందని లోకే విమర్శించారు. ఏ చిన్న కామెంట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినా వెంటనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తనపై ఇప్పటికే 14 కేసులున్నాయని, కావాలనుకుంటే మరో 10 కేసులు పెట్టుకోండని అన్నారు. తాను జగన్ లా కేసులకు భయపడనని అన్నారు. హత్య చేసి తిరుగుతున్నా.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు పెట్టడానికి తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేయనప్పుడు తన కేసులను వెంటనే పరిష్కరించాలని కోర్టును జగన్ అడగొచ్చు కదా అని ప్రశ్నించారు లోకేష్. తన కేసుల పరిష్కారానికి ఫాసట్్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని జగన్ అడగగలరా? అని లోకేష్ నిలదీశారు.
డ్రైవర్ను హత్య చేసిన ఎమ్మెల్సీ.. సజ్జల, ద్వారంపూడితో భేటీ: లోకేష్
డ్రైవర్ను హత్య చేసిన వైసీపీ అనంతబాబు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారన్నారు నారా లోకేష్. మరో 24 గంటల్లో అనంతబాబును అరెస్ట్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య చేసి 72 గంటలైనా.. ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? అని ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు సజ్జలతోపాటు ఎమ్మెల్యే ద్వారంపూడిని కలిశారని లోకేష్ చెప్పారు. గంజాయి రవాణాలోనూ అనంతబాబు ప్రధాని భూమిక పోషిస్తున్నారని.. గంజాయిని తగలబెట్టినందుకే డీజీపీని పంపించారని తెలిపారు.