తాడిపత్రిలో మీరు విసిరిన రాళ్లు.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్ ని తాకుతాయి: నారా లోకేష్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ రాళ్ళ దాడికి దారి తీసింది. ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యింది. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో టిడిపి ఇన్చార్జి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి గత మూడు రోజులుగా పర్యటన చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో పర్యటిస్తున్న ఆయన మూడో వార్డు లోకి రాగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవటంతో ఘటన చోటుచేసుకుంది.
ఆ సమయంలో ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి రాళ్ల దాడి చేశారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెండు పార్టీలు బాహాబాహీకి దిగాయి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడకు రావడంతో మరోమారు వైసిపి టిడిపి శ్రేణుల మధ్య రాళ్ల దాడితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వైసీపీ దాడికి పాల్పడింది అని టీడీపీ పోలీస్ స్టేషన్ లో ఆరుగురిపై ఫిర్యాదు చేసింది.
ఇక ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. టిడిపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని వైసీపీ ముష్కర మూకలు ఇటీవల చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్లదాడికి తెగబడ్డాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇప్పుడు తాడిపత్రి మూడోవార్డులో పర్యటిస్తున్న టిడిపి నేత జేసీ అస్మిత్ రెడ్డి పై దాడికి బరి తెగించాయి అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారాయని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో వీధిలైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసిన పిరికిపందలు పోలీసుల మాటుకెళ్లి దాక్కోవడం కాదు అటువంటి పడిన నారా లోకేష్, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి అని సవాల్ విసిరారు. తాడిపత్రిలో మీరు విసిరిన రాళ్లు ..త్వరలో తాడేపల్లి ప్యాలెస్ ని తాకుతాయి అంటూ నారా లోకేష్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.