ఇప్పుడు జగన్ మోడీ రెడ్డి! పవన్ కూడా భయపడుతున్నారు: లోకేష్ సెటైర్లు
చిత్తూరు: ఇటీవల కాలంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అటు కేంద్రం, బీజేపీపై.. ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడిని పెంచారు. గురువారం చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం తమ్మిశిలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ భవన సముదాయాన్ని ప్రారంభించారు.

కేంద్రం నమ్మక ద్రోహం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు త్వరలోనే రూ.1000చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోకుండా నాలుగేళ్లపాటు కేంద్రం ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు.
Recommended Video


జగన్, పవన్ భయపడుతున్నారు..
చట్ట ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తాత్సారం చేస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని అన్నారు. మోడీని విమర్శిస్తే జైలుకెళ్తాననే భయం జగన్కు ఉందని అన్నారు.

జగన్ మోడీ రెడ్డి
జగన్ పేరు మారిందని.. ఆయన ఇప్పుడు జగన్ మోడీ రెడ్డి అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా 2019లో 25పార్లమెంటు సీట్లు గెలిచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని లోకేష్ అన్నారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే కియా లాంటి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.

త్వరలో రిలయన్స్ కూడా వస్తోంది..
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్ వంటి సంస్థలు వచ్చాయని లోకేష్ తెలిపారు. త్వరలోనే రిలయన్స్ కూడా రాష్ట్రానికి రాబోతోందని చెప్పారు. తుమ్మిశి పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో అద్భుతమైన అవకాశాలున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications