నెంబర్ టూ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నారా లోకేష్ చేతికే
హైదరాబాద్: వచ్చే తెలుగుదేశం పార్టీ మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్కు పెద్ద పదవి అప్పగించవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఆయనకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడం లాంఛనమేనని అంటున్నారు. ఇప్పటికే ఆయన పార్టీలో నెంబర్ టూగా కొనసాగుతున్నారు. చంద్రబాబు తర్వాత స్థానం తెలుగుదేశం పార్టీలో ఆయనదే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఆ ముగ్గురు అభ్యర్థులను కూడా లోకేష్ ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు విజయం సాధిస్తే నారా లోకేష్కు దాదాపుగా పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అది జరిగితే పార్టీపరమైన నిర్ణయాలన్నీ నారా లోకేష్ చేతికి వెళ్తాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. నాలుగు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే టిడిపి మూడు సీట్లు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశం ఉంది. తగిన అభ్యర్థుల ఎంపికకు నారా లోకేష్ ఇప్పటికే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల నాయకులతో మూడు సమావేశాలు నిర్వహించారు.
అమెరికా పర్యటనను ముగించుకున్న లోకేష్ అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కొంత మంది పేర్లతో లోకేష్ చంద్రబాబుకు జాబితాను నాలుగు రోజుల్లో సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు.
వివిధ కారణాల వల్ల 2014 ఎన్నికల్లో టికెట్లు దక్కని వెనకబడిన తరగతుల నాయకులకు అవకాశం ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, విజయనగరం జిల్లా నుంచి ద్వారంపూడి జగదీష్, నెల్లూరు జిల్లా నుంచి బీడ రవిచంద్ర యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప జిల్లాకు చెదిన లింగారెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్నారు. వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయులుగా ఉంటూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చౌదరి నారాయణ మూర్తి, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. వీరిద్దరు కూడా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవులకు పోటీ చేస్తే బాగుంటుందని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గవర్నర్ కోటాలో ఎన్ఎండి ఫరూక్, ఎంఎ షరీఫ్, ప్రతిభా భారతి పేర్లను సిఫార్సు చేయాలని భావిస్తున్నారు. వీటి భర్తీకి నోటిఫికేష్ జూలైలో వస్తుందని అనుకుంటున్నారు.
కాగా, బిజెపి ఒక్క ఎమ్మెల్సీ సీటు కావాలని పట్టుబడుతోంది. అయితే, అందుకు టిడిపి సిద్ధంగా లేదని తెలుస్తోంది. అ విషయాన్ని బిజెపి నాయకత్వానికి స్ఫష్టం చేసినట్లు కూడా సమాచారం. బిజెపి నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఇప్పటికే రాజ్యసభ సీటు ఇచ్చినందున అంతకు మించి ఇవ్వలేమని అంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే డి. గోవింద రెడ్డి పేరును ప్రకటించింది.