జగన్కు ఝలక్: టచ్లో ఎమ్మెల్యేలు, ఇప్పుడే చేరాలని ముగ్గురి ఉత్సాహం
అమరావతి: తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల తాకిడికి తట్టుకోలేక వైసిపి అధనేత జగన్ కులాలు, మతాల మధ్యే కాకుండా వ్యక్తుల మధ్య చిచ్చుపెడుతున్నారని మంత్రి నారా లోకేష్ మంగళవారం ధ్వజమెత్తారు.
టిడిపిలో చేరేందుకు ముగ్గురు ఉత్సాహం
జగన్ తీరుతో విసిగిపోయిన వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు తమతో టచ్లో ఉన్నారని లోకేష్ వెల్లడించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఎంత తొందరగా చేరుదామా అని ఉబలాటపడుతున్నారని చెప్పారు. శృంగవరపుకోటలో బహిరంగ సభలో మాట్లాడారు.
Recommended Video
దొంగ మీడియా అంటూ సాక్షిపై
ఆరోగ్యం బాగోలేక పార్టీ సమావేశానికి నేను వెళ్లకపోతే తన దొంగ పత్రిక, దొంగ చానల్లో తన తండ్రికి, తనకు విభేదాలున్నాయని జగన్ ప్రచారం చేశారని లోకేష్ అన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు సృష్టించడం ఆయనకే చెల్లిందన్నారు. జగన్ ప్రతి దానిని చెడగొట్టా ఆలోచన చేస్తున్నారన్నారు.
తగవు పెట్టాలని జగన్ ప్రయత్నం
పట్టిసీమతో రాయలసీమ నీటికష్టాలను తొలగించేందుకు సీఎం ప్రయత్నిస్తుంటే, జగన్ గోదావరి జిల్లాలకు వెళ్లి మీ నీటిని రాయలసీమకు తరలించుకుపోతున్నారని ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని, రాయలసీమకు వెళ్లి పట్టిసీమతో ప్రయోజనం ఉండదని ప్రాంతాల వారీగా తగవులు పెట్టాలని చూశారని లోకేష్ ధ్వజమెత్తారు. అభివృద్ధి కోసం చంద్రబాబును 2019లోను సీఎంను చేయాలన్నారు.
నా భార్య, తల్లి ఖర్చు పెడుతుంటే మేం ఖర్చు చేస్తున్నాం
మా ఇంట్లో తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారని, తాను, తన తండ్రి చంద్రబాబు వారు కూడబెట్టిన సొమ్మంతా రాజకీయాల్లో ఖర్చు చేస్తుంటామని, రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఇదే సాక్ష్యమని లోకేష్ అన్నారు. ప్రతి ఇంట్లో మహిళలు సంపాదనపరులు కావాలన్నారు. లోకేష్ విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించారు.