త్వరలోనే రోడ్డెక్కుతా - టార్గెట్ జగన్ ప్రభుత్వం : లోకేష్ రూటు మారింది..!!
టీడీపీ నేత నారా లోకేష్ రూటు మార్చారు. గతం కంటే భిన్నంగా ముందుకెళ్తున్నారు. దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతున్నారు. రానున్న ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాను 2019 లో ఎక్కడైతే ఓడారో..అక్కడే పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా మంగళగిరిలో స్థానిక పార్టీ నేతలు - కార్యకర్తలు..ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి గిఫ్ఠ్ గా ఇస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
రూటు - మాట మార్చేసిన లోకేష్
ఇక, రాష్ట్రం లో పర్యటన సమయంలోనూ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఇక, మాట తీరులోనూ మార్పు కనిపిస్తోంది. స్పష్టంగా ..ఛాలెంజ్ లు విసురుతూ వైసీపీ పైన విరుచుకుపడుతున్నారు. ఇక, తాజాగా పల్నాడు లో పర్యటన సమయంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. భయం అనేది తమ బ్లడ్ లోనే లేదంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సీఎం జగన్.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులకే భయపడని తాము.. ఇక నోటీసులకు భయపడతామా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.
వైసీపీతో సై అంటే సై
తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తూ.. పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని కొందరు నేతలు చెత్తబుట్టలో వేస్తే.. మరికొందరైతే తగలబెట్టారని చెప్పుకొచ్చారు. హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్.. రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జల్లయ్య ముగ్గురు పిల్లల్ని తాను వ్యక్తిగతంగా చదివిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారన్న లోకేశ్.. తనతో పాటు నేతలంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. అక్టోబర్ 2 నుంచి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఇక రోడ్డు మీదే ఉండేలా ప్రణాళికలు
ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఇక రోడ్డెక్కుతానని ప్రకటించిన లోకేష్.. ప్రభుత్వ విధానాలే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకు సీట్లు కేటాయింపు నిర్ణయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా లోకేష్ కు మరింతగా మద్దతు పెరిగేలా వ్యహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీంతో..లోకేష్ రోడ్డెక్కితే స్పందన ఎలా ఉంటుంది.. పార్టీకి ఎంత వరకు మేలు చేస్తుందనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది.