జగన్, పవన్, బీజేపీల కుట్ర, వంచన సభ ఎందుకు?: ఏకేసిన ఏపీ మంత్రులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం, రాష్ట్రంపై కేంద్రంతో కలిసి మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయని మంత్రి నారాయణ ఆరోపించారు.
Recommended Video
మూడు పార్టీల కుట్ర
మంగళవారం సాయంత్రం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ, జనసేన, బీజేపీపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీ కుట్రకు సోము వీర్రాజు వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. అంతేగాక, చంద్రబాబు దీక్ష రోజునే పవన్ టీడీపీపై ఆరోపణలు చేయడం కుట్రలో భాగమేనని అన్నారు.
వంచన సభ ఎందుకు?
సోము వీర్రాజు వెంటనే సీఎంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై చేస్తున్న పోరాటానికి అడ్డంకులు సృష్టిస్తున్న వైసీపీ ఏ మొహం పెట్టుకుని వంచనదినం పాటిస్తుందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. కేంద్ర వైఖరికి నిరసనగా తిరుపతిలో చంద్రబాబు సభ పెడుతుంటే.. అదే రోజు జగన్ వంచన సభ ఎందుకు పెట్టారని మండిపడ్డారు.
జగన్ ఓ భస్మాసురుడు
ఇక మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ భస్మాసురుడని అన్నారు. జగన్ యాత్రలో ప్రభుత్వ ఇసుక విధానంపై చేసిన విమర్శలను మంత్రి తప్పుబట్టారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణానికి ఇసుక తరలిస్తుంటే.. అమ్ముకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్.. అది పాదయాత్రా.??
భస్మాసురుడు తన నెత్తి మీద తానే చేయి పెట్టుకుంటే జగన్ మాత్రం తన భస్మాసుర హస్తాన్ని రాష్ట్రం మీద పెడుతున్నారని మంత్రి దేవినేని ఆరోపించారు. జగన్ సభలకు రూ. 500 చొప్పున ఇచ్చి ప్రజలను తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చేసేది పాదయాత్ర కాదని.. మార్నింగ్, ఈవినింగ్ వాక్ మాత్రమేనని అన్నారు.
తమ్ముడూ జగన్.. మోడీ కాళ్లపై పడితే..
అంతేగాక, ‘తమ్ముడూ జగన్.. నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడకు' అంటూ జగన్పై ఏపీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఇరిగేషన్ గురించి జగన్ కేమీ తెలియదని ఎప్పుడో చెప్పానని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీ కాళ్లపై పడినందుకు జగన్ కు లబ్ధి చేకూరిందని, మోడీ బూట్లు నాకితే ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ ఎత్తేశారని దేవినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.