తెలంగాణకు ఇచ్చి మాకివ్వరా, జగన్ దొరికిపోయారు!: మోడీపై బాబు, పవన్కు ప్రశ్న
అనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేశారని, అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైయస్ జగన్లు మాట్లాడటం లేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆయన అనంతపురం జిల్లాలోని గుమ్మగుట్టలో పర్యటించారు. బైరవానితిప్ప ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమ త్వరలోనే హార్టికల్చర్ హబ్గా మారుతుందని చెప్పారు. రాయలసీమను ధనిక ప్రాంతంగా మారుస్తానని చెప్పారు.
లోకేష్ను తీసేయండి, తువ్వాలుతో బయట స్నానం చేశాడు, జగన్లా ముద్దులు పెట్టను: పవన్
తాను సంకల్ప బలంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల కోసం వేసిన రూ.350 కోట్ల డబ్బును వెనక్కి తీసుకున్నారని చెప్పారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చి, ఏపీకి మాత్రం ఇవ్వకపోవడం వివక్ష అని ఆగ్రహించారు.
అందుకే ఎన్డీయే నుంచి బయటకు
ఎన్డీయేలో నుంచి తాము బయటకు వచ్చి పదవులకు రాజీనామా చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రజల తరఫున పోరాడేందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలన్నారు. ఏపీకి అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బీజేపీని హెచ్చరించారు.
వైసీపీ అడ్డంగా దొరికింది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ అవినీతి పార్టీ అని, బీజేపీతో కుమ్మక్కై అడ్డంగా దొరికిందని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీ కాళ్లు పట్టుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు రావని తెలిసి వైసీపీ నేతలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎప్పుడూ పోరాడలేదని చెప్పారు. జైలుకు వెళ్తారనే భయంతో ఏపీకి అన్యాయం చేస్తున్నారన్నారు.
పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ప్రశ్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏమయిందని చంద్రబాబు నిలదీశారు. నిధుల లెక్క తేల్చేందుకు దానిని వేశారని, దాని గురించి చెప్పాలన్నారు. తాము ఎన్డీయే నుంచి బయటకు రాగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మహాకూటమిలో చేరితే విమర్శలు చేస్తున్నారన్నారు. టీడీపీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అన్నారు. ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆదుకుంటామని చెప్పారు.
ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది
విభజన తర్వాత ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. విభజన హామీల్లో ఒక్కదానిని కేంద్రం పరిష్కరించలేదన్నారు. అయినా తాము ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్మపోరాటం సాగిస్తున్నామని చెప్పారు.