చంద్రబాబుకు మోడీ ఫోన్: ప్రత్యేక హోదాపై చల్లబడిన రాజకీయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మో బుధవారం ఉదయం ఫోన్ చేశారు. ప్రధానితో మాట్లాడాలని మంగళవారం చంద్రబాబు ప్రయత్నించారు. చంద్రబాబు మోడీకి ఫోన్ చేశారు. అయితే మోడీ ఎత్తలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత మోడీయే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు.
ఈ నెల 15 తర్వాత ఢిల్లీకి రావాలని ఆయన చంద్రబాబును ఆహ్వానించారు. పదిహేనో తేదీ వరకూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందడిఉన్నందున ఆ తర్వాత రావాలని ఆయన సూచించారు. ఈ నెల 17వ తేదీన ప్రధాని దుబాయి పర్యటనకు వెళ్తున్నారు. ఆ తేదీన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కూడా ఉంది. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది.
ప్రధానితో చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి మాట్లాడారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన సమస్యలను ఎదుర్కుంటోదని, మిగిలిన రాష్ట్రాలతో తమ రాష్ట్రాన్ని పోల్చవద్దని, ఎపికి సాయం అందించే విషయాన్ని విడిగా పరిశీలించాలని చంద్రబాబు చెప్పారు. ఇద్దరం కలిసే ప్రజలకు హామీ ఇచ్చామనిస వాటిని నిలుపుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు ప్రధానితో అన్నట్లు సమాచారం.

చె ప్పిన వాటి నుంచి వెనకడుగు వేసే ఉద్దేశం తమకు లేదని ప్రధాని ఆయనతో అన్నారు. ‘మీపై నమ్మకం ఉంది. కాని ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. మీరు ఇక జాప్యం చేయవద్దు. త్వరగా నిర్ణయం తీసుకోండి' అని చంద్రబాబు ఆయనతో అన్నారు. త్వరగానే నిర్ణయం తీసుకోవాలని అనుకొంటున్నామని, తాను సంబంధిత మంత్రిత్వ శాఖలతో కూడా మాట్లాడుతున్నానని ప్రధాని చెప్పారు.
ప్రధాని చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వేడి తగ్గింది. ప్రతిపక్షాల ఆందోళనతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న టిడిపి పార్లమెంటు సభ్యులకు ఊరట లభించింది. సమస్యకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం పెరిగింది. ప్రతిపక్షాలకూ ప్రజలకూ సమాధానం చెప్పుకోవడానికి అవకాశం చిక్కింది. బుధవారం సాయంత్రం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా మాట్లాడడంతో కూడా తెలుగుదేశం వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.












Click it and Unblock the Notifications