మూడు సభలు: ఒకే వేదికపై మోడీ, బాబు, పవన్
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపై కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా పార్టీలు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాయి.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ముగ్గురు ప్రచారం చేయనున్నట్లు టిడిపి, బిజెపి, పార్టీల శ్రేణులు వెల్లడించాయి. ఏప్రిల్ 24న కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లలో నిర్వహించే బహిరంగ సభలలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని పార్టీల శ్రేణులు పేర్కొంటున్నాయి. నాయకుల అందుబాటును బట్టి ఈ సభల నిర్వహణ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం కూడా ఉండచ్చని తెలిపారు.

ఒకే రోజు మూడు సభలు నిర్వహించాలనే యోచనలో ఇరు పార్టీల నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నరేంద్ర మోడీ కార్యాలయానికి కూడా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. కాగా, ఒకే రోజు మూడు సభలంటే సమయం సరిపోదేమోనని, రెండు బహిరంగ సభలైతే బాగుంటుందేమోనన్న అభిప్రాయాన్ని మోడీ కార్యాలయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరో రెండురోజుల్లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఒక రోజులోనే మూడు సభలు నిర్వహించాలనుకుంటే కరీంనగర్లో ఉదయం, నిజామాబాద్లో మధ్యాహ్నం, హైదరాబాద్లో రాత్రి బహిరంగ సభలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే బిజెపి నేతలు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. తెలంగాణ, సీమాంధ్రల్లో నరేంద్ర మోడీ పాల్గొనే సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో బిజెపి సభలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ నేతలతో కూడా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications