నేను కూడా అలా చేశా: మోడీ నోట ఎన్టీఆర్ మాట
చిత్తూరు: ఎన్టీ రామారావు ఏ కార్యక్రమైనా వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచే ప్రారంభించేవారని, తాను సీమాంధ్ర ప్రచారాన్ని అక్కడి నుంచే ప్రారంభించానని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని ఆయన కొనియాడారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం ప్రసంగించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.
తాను వెంకటేశ్వర స్వామి పవిత్ర భూమి నుంచి సీమాంధ్రలో అడుగు పెట్టాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన భూమి రాయలసీమ అని ఆయన అన్నారు. రవీంద్రనాథ్ ఠాగోర్ జనగనమణ రాసిన పవిత్రమైన నేల మదనపల్లి అని ఆయన అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు తాము కృషి చేస్తామని, స్కామాంధ్రకు ఓటు వేస్తే నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజలు ఎన్నుకునేది ప్రభుత్వాన్ని కాదని, తమ భవిష్యత్తుని అని ఆయన అన్నారు. అందువల్ల స్వర్ణాంధ్ర కావాలో, స్కామాంధ్ర కావాలో సీమాంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. బిజెపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మండుటెండలో కూడా మీరు చూపిన ఆప్యాయత మరిచిపోలేనిదని ఆయన అన్నారు.
ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పడితే సీమాంధ్ర సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని లూటీ చేసినవారికి మద్దతు ఇవ్వవద్దని ఆయన కోరారు. తమకు ఓటేస్తే స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సాగునీరు అందిస్తే రాయలసీమలో సిరులు పండిస్తారని, వాజ్పేయి కలలు గన్న నదుల అనుసంధానం పూర్తి చేసి, రాయలసీమకు నీరు అందిస్తామని చెప్పారు. సీమాంధ్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. స్కాం ఇండియాను స్కీం ఇండియాగా మారుస్తామని అన్నారు.