మోడీ పర్యటన: చెన్నై ఘటనతో పోలీసుల అప్రమత్తం
విజయవాడ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్ర పర్యటన సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే ఐదు బహిరంగ సభల్లో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. తమిళనాడులోని చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో సీమాంధ్రలోని అన్ని రైల్వే స్టేషన్లలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, విజయవాడ క్లాక్ టవర్ దగ్గర కొన్ని బాంబులు లభించాయి. అవి స్థానికంగా తయారు చేసినవిగా పోలీసులు గుర్తించారు. నెల్లూరులో అనుస్పదంగా ఉన్న సూట్కేసును పోలీసులు గుర్తించారు. అనుమానితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ బహిరంగ సభలు జరిగే ప్రాంతాలకు అదనపు పోలీసు బలగాలను తరలించారు.

మోడీ పాల్గొనే సభా వేదిక ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కూడా కొన్ని భద్రతా బలగాలు సీమాంధ్ర ప్రాంతానికి తరలించారు. విజయవాడ, గుంటూరు, మదనపపల్లి ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ గురువారం తొలుత మదనపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, చెన్నై రైల్వే స్టేషన్లో బాంబు పేలుళ్లలో ఓ యువతి మృతి చందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాకు చెందిన స్వామి(22) అనే యువతి ఈ ఘటనలో మృతి చెందింది. ఘటనతో తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బుధవారమే ఐఎస్ఐ ఉగ్రవాది జకీర్ హుస్సేన్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. అతడు పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా చెన్నై చేరుకున్నట్లు సమాచారం. పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు జకీర్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా ఎన్ఐఏ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications