తగలబడుతున్న ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే?
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో శనివారం భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో 37 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఈ బస్సు, రామభద్రపురం మండలం తారాపురం సమీపానికి చేరుకోగానే వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెనువెంటనే బస్సును నిలిపివేసి, ప్రయాణికులందరినీ కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు.

సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే..
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి బస్సు పూర్తిగా అస్థిపంజరంగా మారింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications