Avanthi Srinivas: ఇక్కడా రివర్సేనా: తలకిందులుగా జాతీయ పతాకం: వైసీపీ మంత్రి ఘనకార్యం.. !
విశాఖపట్నం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో రివర్స్ టెండరింగ్ ఒకటి. దీనివల్ల వందలాది కోట్ల రూపాయల మేర నిధులు ఆదా అవుతున్నాయి. కాంట్రాక్టర్ల జేబుల నుంచి మళ్లీ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. దీనివల్ల ఆదాయం మిగులుతున్నప్పటికీ.. అభివృద్ధి పనులు స్తంభించిపోతున్నాయనేది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణ. రాష్ట్రాభివృద్ధి కూడా రివర్స్లోనే నడుస్తోందంటూ సింబాలిక్గా చాలాసార్లు చెప్పుకొచ్చారు.

రివర్స్ టెండరింగేనా.. అంటూ
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. జాతీయ పతాకాన్ని కూడా రివర్స్లోనే ఎగరేశారు వైఎస్ఆర్సీపీకి చెందిన మంత్రి. ఈ వ్యవహారం కాస్తా.. మరోసారి టీడీపీ చేతికి విమర్శనాస్త్రాలను అందించినట్టయింది. సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వైరల్గా మారిందా వీడియో. ప్రభుత్వ పెద్దలు జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో కూడా రివర్స్ టెండరింగ్ను అనుసరిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

భీమిలీలో తలకిందులుగా జాతీయ పతాకం..
విశాఖపట్నం జిల్లా భీమిలీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఈ ఉదంతం. స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఈ ఉదయం తన భీమిలిలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.. తలకిందులుగా. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ (వీఎంఆర్డీఏ) ద్రోణంరాజు శ్రీనివాస్ సహా పలువురు వైసీపీ నాయకులు, మంత్రి అనుచరులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కిందికి దించి..సరి చేసి..
అనంతరం బోలో స్వతంత్ర భారత్ కీ.. అంటూ నినదించారు. జాతీయ పతాకానికి వందనం అర్పించారు. అంతా బాగనే ఉన్నప్పటికీ.. తాము జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగుర వేసిన విషయాన్ని గుర్తించలేకపోయారు. జాతీయ పతాకానికి వందనాన్ని అర్పించిన తరువాత వారు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత భీమిలీ అధికారులు దీన్ని గమనించారు. ఆ వెంటనే- జాతీయ పతాకాన్ని కిందికి దించారు. సరిచేసిన తరువాత మరోసారి ఎగురవేశారు.

విచారం వ్యక్తం చేసిన మంత్రి..
జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. చూసుకోవాల్సిన పని లేదా? అని అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారని భీమిలీ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఎవరూ గుర్తించకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మార్చింది.












Click it and Unblock the Notifications