జగన్ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్-సీమ లిఫ్ట్ పనులపై ఆగ్రహం-కేంద్రంతో కుమ్మక్కు వ్యాఖ్యలు
ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ వ్యపహారం జాతీయ హరిత ట్రైబ్యునల్ లో ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. లిఫ్ట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్టీటీ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కేంద్రంతో ఏపీ సర్కార్ కుమ్మక్కైనట్లు కనిపిస్తోందంటూ ట్రైబ్యునల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ వల్ల తమ సాగు నీటి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ను తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. దీంతో పాటు రాయలసీమ లిఫ్ట్ పనులు కొనసాగుతున్న ఫొటోల్ని సైతం ఆధారాలుగా సమర్పించింది. వీటిని పరిశీలించిన ఎన్టీటీ ధర్మాసనం ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పనులు ఆపాలంటూ తాము ఇచ్చిన ఆదేశాల్ని ధిక్కరించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రాకుండానే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తుండటంపై ఎన్టీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే కేంద్రం ఏపీ ప్రభుత్వం కుమ్మక్మైనట్లు కనిపిస్తోందని తెలిపింది. గతంలో తామిచ్చిన ఆదేశాల్ని ఉల్లంఘించిన అధికారులపై ధిక్కార చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలపై పిటిషనర్లను ఎన్టీటీ ధర్మాసనం ప్రశ్నించింది. తాము ఇప్పటివరకూ అధికారులపై ధిక్కార చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు తీసుకునేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తామని తెలిపింది. హైకోర్టు ద్వారా ఉత్తర్వులు ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది. ఆగస్టు 27న ఈ వ్యవహారంపై తుది తీర్పు ఇస్తామని ఎన్టీటీ ధర్మాసనం తెలిపింది.
ఎన్టీటీ ఆదేశాల మేరకు కృష్ణా రివర్ బోర్డు అధికారులు రాయలసీమ లిఫ్ట్ పరిశీలించారు. అయితే తాము వెళ్లినప్పుడు అక్కడ నిర్మాణ సామాగ్రి ఉందని, కానీ పనులు జరగడం లేదని అధికారులు ఎన్టీటీకి నివేదిక ఇచ్చారు. అదే సమయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా మౌనం వహిస్తోంది. దీంతో ఎన్జీటీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 27న ఉత్తర్లులు జారీ చేస్తామని వెల్లడించింది.