నవనిర్మాణ దీక్ష బాధాకరమైన కార్యక్రమం:మంత్రి అమరనాథ రెడ్డి
చిత్తూరు:నవనిర్మాణ దీక్ష సంతోషంగా చేసుకునే కార్యక్రమం కాదని బాధతో చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేంద్రం వైఖరే కారణమన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి,వైసిపిల తీరు శత్రువు శత్రువు మిత్రులన్న చందంగా మారిందని, ఆ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి అనవసర ఆరోపణలతో అధికార పక్షంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భాజపా ప్రత్యేక హోదా ఇస్తామని, అటు తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందన్నారు. అందుకే నవనిర్మాణ దీక్ష బాధాకరంగా మారిందన్నారు.

భాజపా మోసం...వైకాపా ద్రోహం
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న భాజపా మోసాన్ని గుర్తించి కేంద్రంతో తెగదెంపులు చేసుకొని ప్రత్యేకహోదా కోసం పోరాడుతూంటే వైకాపా మద్దతు పలకక పోగా ప్రతి విమర్శలు చేస్తోందన్నారు. అమరావతి నిర్మాణానికి అక్కడి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కేంద్రం మాత్రం కేవలం రూ.15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుందన్నారు. ప్రధాని తన సొంత రాష్ట్రంలోని దొలేరా ప్రాంతంలో రూ.2 లక్షల కోట్లతో కొత్త నగరాన్నే నిర్మిస్తున్నారన్నారు.
Recommended Video


నవ నిర్మాణ దీక్ష...బాధాకరం
నిజానికి నవ నిర్మాణ దీక్ష సంతోషంగా చేసుకునే కార్యక్రమం కాదని బాధతో చేస్తున్నామని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మన మనోభావాలకు వ్యతిరేకంగా రెండుగా చీల్చి, మనకు అప్పులను అంటగట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడుతూ ఉన్న సహజ వనరులతో, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ...అభివృద్ధి చెందుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నామని మంత్రి చెప్పారు. మన కష్టం భావితరాలు పడకూడదనే సిఎం చంద్రబాబు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు.

ఆ పథకం...సంచలనం
నిరుద్యోగ యువతీ, యువకులకు చంద్రన్న భృతి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయమన్నారు. అలాగే నూతన రేషన్కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, రాయితీపై బిందు సేద్యం, వ్యవసాయ పనిముట్ల పంపిణీ, ఇన్పుట్ సబ్సిడీ తదితర ప్రభుత్వ పథకాలు ఎన్నో ప్రజల సంక్షేమం కోసం అమలు చేయడం జరుగుతోందన్నారు. అలాగే గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తూ పెద్దపీట వేస్తోందన్నారు. పెద్దఎత్తున సిమెంటు రోడ్ల నిర్మాణం, ఎల్ఈడీ దీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఫైబర్ గ్రిడ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో చేపడుతున్నామన్నారు.

లబ్దిదారులకు...పంపిణీ
నవ నిర్మాణ దీక్షలో భాగంగా వి.కోటలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మంత్రి అమరనాథ్ రెడ్డి ప్రత్యేక పత్రికను ఆవిష్కరించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ పథకం కింద రూ.1.75 కోట్ల చెక్కును అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో చేరడానికి పట్టాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఆయనకు అండగా నిలవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications