ఏపీలో నయీం ప్రధాన అనుచరుడంటూ ఆరోపణలు: ఎవరీ జగ్గిరెడ్డి?
అమరావతి: గ్యాంగ్ స్టర్ నయీంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకులున్నాయని టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ గత రెండు రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ నయీం సెటిల్ మెంట్లన్నీ జగ్గిరెడ్డి చూసేవాడని ఆయన పదే పదే చెప్తున్నారు.
అంతేకాదు జగ్గిరెడ్డి వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారని అంటున్నారు. మంగళవారం రాత్రి ఓ టీవీ ఛానెల్తో మాట్లాడిన ఆయన మంత్రి అచ్చెన్నాయుడుపై చేసిన ఆరోపణలకు తాను కట్టిబడి ఉన్నానంటూ చర్చకు వస్తే, తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో నట్టి కుమార్ నోటి వెంట జగ్గి రెడ్డి అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సైకిల్ స్టాండ్ ఓనర్గా కెరీర్ ప్రారంభించిన జగ్గిరెడ్డి ఈ రోజు ఎలా ఎదిగాడని ప్రశ్నించడంతోపాటు పీలా గోవిందు నివాసం నుంచి జగ్గిరెడ్డి ఈ లావాదేవీలు నిర్వహించేవాడని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఎవరీ జగ్గిరెడ్డి అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. నట్టి కుమార్ ఆరోపణలతో జగ్గిరెడ్డి సైతం మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు. తానెవరో మంత్రి అచ్చెన్నాయుడికి తెలియదని అన్నారు. అయితే టీవీ ఇంటర్యూల ద్వారా తానెవరో మంత్రికి తెలిసే అవకాశం ఉందని అన్నారు.
తాను వేల కోట్లు సంపాదించానన్నది అవాస్తవమని, తనకు వేల కోట్లు ఆస్తులు లేవని ఆయన స్పస్టం చేశారు. నిర్మాత నట్టికుమార్తో తనకు ఎటువంటి విబేధాలు లేవని, కానీ నట్టి కుమార్ ఎందుకు అలా చెబుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తనకు తెలియదని అన్నారు.
తనది రైతు కుటుంబమని చెప్పిన ఆయన అనకాపల్లిలో రాజా థియేటర్లో తన భార్య క్యాంటీన్ నడుపుతోందని అన్నారు. విశాఖపట్నంలో తనపై ఒక్క పోలీసు కంప్లైంట్ కూడా లేదని, ఎవరితోనూ తాను గొడవలు పెట్టుకునే వాడిని కాదని అన్నారు. ఆ థియేటర్ మేనేజర్తో ఉన్న లావాదేవీల వల్ల, ఆయన తన ఫోన్ నెంబర్తో నట్టి కుమార్కు ఫోన్ చేశారని అన్నారు.
అందువల్లనే ఆయన తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన తెలిపారు. నర్సన్నపేట థియేటర్ ఏదో వివాదంలో చిక్కుకుందని, దానిని తాను ఖాళీ చేయించానని ఆయన ఆరోపించారని, అందులో తన మనుషులు ఎవరూ ఆయన స్పష్టం చేశారు. నర్సీపట్నంలో నాలుగు థియేటర్లలో క్యాంటీన్లు నడుపుతున్నానని, అది లాభసాటిగా లేకపోవడంతో దానిని సబ్ లీజుకిచ్చానని ఆయన చెప్పారు.
మా నాన్నగారు రైస్ మిల్లు ఫీల్డ్లో ఉన్నారని, రైస్ మిల్లులో ఫైనాన్సియర్గా ఉన్న సమయంలో 90ల్లో విశాఖకు వచ్చామని అన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలని ఇద్దరు కూడా చదవుకుంటున్నారని చెప్పారు. నట్టి కుమార్ ఆరోపిస్తున్నట్టు తన వద్ద వేల కోట్లు ఆస్తులుంటే ఎవరికైనా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
మనిషికి ఏదైనా వ్యాపకం ఉండాలనే ఉద్దేశ్యంతో వ్యాపారం చేసుకుంటున్నానని, ఎవరితోనూ గొడవలు పడనని ఆయన చెప్పారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తన మావయ్యని ఆయన తెలిపారు. ప్రస్తుతం తన బావమరిది ఎమ్మెల్యే అని ఆయన చెప్పారు. వారి రాకీయ నేపథ్యమే తప్ప, దందా నేపథ్యం తనకు లేదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications