AP Volunteers: వాలంటీర్లపై కూటమి యూటర్న్-వైసీపీకి మరో అస్త్రం..?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరు ప్రతీ 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వానికీ, సంక్షేమ పథకాల లబ్దిదారులకూ మధ్య వారధిగా పనిచేశారు. అయితే వైసీపీ కార్యకర్తలుగా ముద్రపడటం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం వంటి కారణాలతో విపక్షాలకు కంటగింపుగా మారారు. అయితే గత ఎన్నికల సమయంలో వారికిచ్చే జీతం 10 వేలకు పెంచి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పింది.
లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తామని, లేని పిల్లాడికి పేరెలా పెడతామంటూ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి చేసిన ప్రకటన వాలంటీర్లకు శరాఘాతంగా మారింది. వాలంటీర్లకు గతేడాది ఆగస్టు తర్వాత వైసీపీ ప్రభుత్వమే కొనసాగింపు ఇవ్వకుండా పక్కనపెట్టేసిందని, ఎన్నికల సమయంలో బలవంతంగా రాజీనామాలు చేయించిందని ఆరోపించారు. అయితే ఎన్డీయే ఎన్నికల హామీ మేరకు వారికి జీతాలు ఎందుకు పెంచలేదనే ప్రశ్నకు వైసీపీ వల్లే అంటూ మంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే ప్రభుత్వం వాలంటీర్లకు ఇంకా భయపడుతోందా అన్న ప్రశ్నలు లేవనెత్తింది.

తమను గెలిపిస్తే వాలంటీర్లకు జీతం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎన్డీయే కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారిని పక్కనబెట్టేసింది. గతంలో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి గెలిచాక జగన్ ఎలా అయితే మూడు రాజధానులంటూ మాట మార్చారో అలాగే కూటమి కూడా ఇప్పుడు వాలంటీర్లపై మాట మార్చేసింది. లేని వాలంటీర్లకు జీతాలెలా ఇస్తామంటూ ప్రశ్నిస్తోంది. అయితే అధికారం చేపట్టగానే తొలిసారి పెన్షన్ పంపిణీ కోసం వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇప్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు వారిని పూర్తిగా పక్కనబెట్టేసినట్లు క్లారిటీ ఇచ్చేసింది.
అయితే వాలంటీర్ల విషయంలో ఎన్ని విమర్శలు ఉన్నా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అందేలా చూడటంలో వారి పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా వాలంటీర్ల వల్లే ఇంటింటికీ పెన్షన్ అలోచన అమలైంది. ఐదేళ్ల పాటు వాలంటీర్లతోనే వైసీపీ సర్కార్ పెన్షన్లతో పాటు ఇతర పథకాలు అమలు చేయించింది. ఇప్పుడు కూటమి సర్కార్ వీరిని పక్కనబెట్టేయడంతో సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ప్రకటనతో వైసీపీ ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతోంది. అదే సమయంలో ఇంత భారీ ఎత్తున ఉన్న వాలంటీర్లతో ఆందోళనలకు కూడా ప్లాన్ చేస్తోంది.












Click it and Unblock the Notifications