బీజేపీపై అనుమానం ఎందుకొచ్చింది?: ఓటమిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: గతంలో తనను ఎవరో ఓడించలేదని, నా చర్యలే నన్ను ఓడించాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు అన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లప్పుడూ ప్రజలు నన్ను ఎన్నుకునేలా జాగ్రత్తపడుతున్నానని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. చర్చా వేదికలో పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
బీజేపీతో పొత్తుపై..
ఎన్నికలకు ముందే బీజేపీ - టిడిపి కలిసి పోటీ చేసిందని, మేం కేంద్రంలో, బీజేపీ తన కేబినెట్లో ఉందని చంద్రబాబు చెప్పారు. కలిసి పని చేస్తున్నామన్నారు. నోట్ల రద్దు అంశం ఓ సంక్షోభం, అలాగే ఓ అవకాశమన్నారు. కేంద్రం నుంచి కోరుకున్న మద్దతు లభిస్తుందా అని ప్రశ్నించగా.. ఇది నిరంతర ప్రక్రియ అని, విభజన చట్టంలో కొన్ని హామీలు, రాజ్యసభలో మరిన్ని ఇచ్చారన్నారు. కొన్ని అమలయ్యాయని తెలిపారు. మరికొన్ని అమలు కావాలన్నారు.
కేంద్రం నన్ను సలహా అడగలేదు: డిజిటలైజేషన్ గురించి..
కరెన్సీ కారణంగా అన్నిచోట్లా ఇది సమస్యగా ఉందని, ఇరవై నాలుగు రోజుల నుంచి తాను దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, ఇబ్బందులను తగ్గించాలని, గత రెండేళ్లుగా పోస్ మిషన్లు ఉపయోగించి పీడీఎస్, పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోందన్నారు. ఇప్పటి వరకు కేంద్రం తన సలహా అడగలేదని, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకోసం ఏర్పాటు చేసిన కమిటీకి వాళ్లు తనను కన్వీనర్గా చేశారని, ఇటీవల కమిటీ సభ్యులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడానని, త్వరలో అందరూ సమావేశమవుతామన్నారు.
బీజేపీతో పోటీపై..
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పోటీ తప్పదని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఆ అనుమానం ఎందుకు వచ్చిందని, నమ్మకంతో కలిసి పని చేశామని, తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
రాజధానిపై.. హైదరాబాదుతో ప్రయోగం చేశా
ప్రపంచవ్యాప్తంగా నగరాలే అధిక వృద్ధికి, ఉఫాధికి, ఉద్యోగ అవకాశాలకు తోడ్పాటు అందిస్తున్నాయని, అప్పట్లో హైదరాబాదుతో ప్రయోగం చేశానని, ఇప్పుడు అమరావతిని నిర్మించుకోవాలన్నారు. రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారన్నారు. రాజధానిని నిర్మించడం చాలా అరుదైన అవకాశమన్నారు. ఇదొక నిజమైన స్మార్ట్ సిటీ అవుతుందన్నారు. దేశంలో టాప్ 1, ప్రపంచంలో టాప్ 10 నగరాల్లో ఒకటి అవుతుందన్నారు.
నిరంతరం గెలవాలి
విజయవాడ, విశాఖ వంటి నగరాలు ఉండగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకోవడంపై మాట్లాడుతూ... నగరాలే ఎక్కువ జీఎస్డీపీ, ఉపాధి, ఆర్థిక వాతావరణాన్ని సమకూరుస్తున్నాయని, ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్పై ఈ ప్రయోగం చేశామని, అక్కడ మేథో ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లామన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్లకు సైబరాబాద్ నగరాన్ని జత చేశామని, ఇప్పుడు హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా మారిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికావాలంటే నేను అన్ని ఎన్నికల్లో నిరంతరం గెలవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతౌల్యం చేసుకుంటూ ప్రజలను ఎప్పుడూ నావైపు ఉండేలా చూసుకోవాలని, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య అమరావతి వస్తోందని, మరోవైపు తెనాలి ఉందని, 25 లక్షలమంది ఇప్పటికే ఉన్నారని చెప్పారు.
మళ్లీ అధికారంలోకి రాకుంటే..
రేపు ఒకవేళ మీరు ఓడిపోతే, మరో పార్టీ వస్తే అని చంద్రబాబును ప్రశ్నించగా.. అందుకే మేం నిరంతరం గెలవాలన్నారు. నాపై నమ్మకంతో హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారని, తర్వాత పరిస్థితులు మారడంతో ఇబ్బందులు పడ్డామన్నారు. గతంలో మంచి ప్రయోగం చేశామని, కాను అప్పుడు కాలం కంటే ముందున్నానని, ఈసారి దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని నా పక్షాన ఉంచుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణతో.. ఇరువురం ఉపయోగించుకోవాలి
తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు, సమస్యలపై మాట్లాడుతూ.. తనకు ఎవరితో ఎలాంటి సమస్యలు లేవని, విభజన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయన,ి వాటిని పరిష్కరించుకోవాల్సిందని, ఎక్కడ వివాదం ఉన్నా ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని, లేకపోతే మనం సమయం కోల్పోతామని, అందుకే సాధ్యమైనచోటల్లా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలనుకుంటున్నామని, రాష్ట్ర విభజన ముగిసిన అంశమని, మెరుగైన పరిస్థితులు, సౌభాగ్యం కోసం రెండు రాష్ట్రాలు ముందడుగు వేయాలన్నారు. అంతా తెలుగుమాట్లాడేవారేనని, మాకు నౌకాశ్రయాల బలం ఉందని, వారు వాటిని ఉపయోగించుకోవాలని, హైదరాబాద్, తెలంగాణకు కొన్ని బలాలున్నాయని, వాటిని మేం ఉపయోగించుకోవాలన్నారు.
చిన్న రాష్ట్రానికి సీఎంగా..
పెద్ద రాష్ట్రం (సమైక్య ఏపీ) నుంచి చిన్న రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై ప్రశ్నించగా.. 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ప్రస్తుతం ఏపీ అని, సింగపూర్కంటే 200 రెట్లు పెద్దదని, జనాభాపరంగానూ 10 రెట్లు ఎక్కువ అన్నారు. సింగపూర్ జనాభా 50 లక్షలుంటే మా జనాభా 5 కోట్లు అన్నారు. సింగపూర్కు తొలుత వనరులు లేవని, వారు చివరకు మట్టిని కూడా బయటి నుంచి తెచ్చుకొని సముద్రాన్ని పూడ్చి నగరాన్ని విస్తరించుకున్నారని చెప్పారు. ఒక మత్స్యకార గ్రామాన్ని ఇప్పుడు అద్భుత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని, దాన్ని అందరూ అభినందిస్తున్నారు. మాకు ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటే ప్రపంచానికి నమూనాగా నిలుస్తామన్నారు.
ఏపీలో ఎన్నో వనరులు
ఏపీలో ఎన్నో వనరులు ఉన్నాయని చెప్పారు. మిగులు విద్యుత్తు ఉందని, భవిష్యత్తులో కూడా విద్యుత్తు సమస్య ఉండదన్నారు. పోలవరం నిర్మిస్తున్నామని, దాని వల్ల మరింత జల విద్యుత్తు వస్తుందన్నారు. నదులు అనుసంధానం చేసి నీటిని సంరక్షిస్తున్నట్లు తెలిపారు. మౌలికవసతుల పరంగా మేం బలంగా ఉన్నామని, రైలు కార్గో లైన్లు మూడు ఏపీ మీదుగా వెళ్తాయని, 974 కిలోమీటర్ల కోస్తాతీరం, డీప్ పోర్టులు ఉన్నాయన్నారు. ఏపీని సరుకు రవాణా కేంద్రంగా చేస్తున్నామన్నారు. వ్యవసాయం, అనుబంధరంగాలు, ఖనిజవనరుల పరంగా బలంగా ఉన్నామన్నారు. గ్యాస్ ఆయిల్లో మేం నెంబర్ వన్ అన్నారు. బీచ్శ్యాండ్, బెరైటీస్, గ్రానైట్, లైమ్స్టోన్ నిల్వలు దండిగా ఉన్నాయని తెలిపారు.
పోటీ పైన..
గుజరాత్, ఇతర రాష్ట్రాలతో పోటీపై మాట్లాడుతూ.. మన పోటీదారుని మంచి స్ఫూర్తితో అర్థం చేసుకోవాలని, వారిని మనం పోటీదారు అని ఎందుకు అనుకోవాలని, వారికంటే మంచిగా చేయాలని భావించాలన్నారు. అందుకే గుజరాత్, తెలంగాణ, కర్ణాటక... ఇలా ఏ రాష్ట్రాన్నీ రాష్ట్రాన్నిపోటీదారుడు అనుకోవడం లేదని, వారికంటే మంచిగా చేయాలనుకుంటున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ మంచి పద్ధతులున్నా వాటిని అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గతంలో ఓటమిపై..
గతంలో ఓడిపోవడంపై మాట్లాడుతూ.. ఆ రోజు కూడా నేను బాగా చేశానని, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని, కొన్నిసార్లు కరవులు వచ్చాయని, మరికొన్నిసార్లు నేను కాలానికంటే ముందు ఉండటం, అన్నీ తక్షణం జరిగిపోవాలనుకోవడం వంటివి జరిగాయన్నారు. ఈసారి అన్నింటినీ సమతౌల్యం చేసుకుంటున్నట్లు చెప్పారు.