NEET PG EXAM 2022 : నీట్ వాయిదా వేయండి- కేంద్రానికి నారా లోకేష్ లేఖ
ఈ ఏడాది జరిగే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయాలని విద్యార్ధుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోనూ వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయాలన్న వినతులు వస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ నేత నారా లోకేష్.. నీట్ పరీక్షపై కేంద్రానికి ఇవాళ లేఖ రాశారు.
నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోవాలని నారా లోకేష్ కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. కరోనా కారణంగా గతేడాది నీట్ పరీక్ష కౌన్సెలింగ్ ఆలస్యమైందని, దీంతో తర్వాతి సెషన్ కు సిద్ధం కావడానికి సమయం లభించలేదని ఈ లేఖలో లోకేష్ తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో మెడికల్ విద్యార్ధులు తమ ఇంటర్న్ షిప్ కూడా పూర్తి కాకపోవడంతో పీజీ పరీక్షకు ప్రవేశ అర్హత కూడా సాధించలేకపోయారని లోకేష్ ఈ లేఖలో గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు హాజరవుతున్న 1.70 లక్షల మంది అభ్యంతరాలను, తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రమంత్రిని లోకేష్ కోరారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్ధులకు తగినంత సమయం దొరకడం లేదని కూడా లోకేష్ వివరించారు. ఈ నెల 21న పరీక్ష ప్రకటించే సరికి విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నట్లు లోకేష్ గుర్తుచేశారు. కేంద్రం చేసిన ప్రకటనతో విద్యార్ధులు కౌన్సిలింగ్ కు వెళ్లాలో, పరీక్ష రాయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. గతేడాది కోవిడ్ డ్యూటీలు చేసిన విద్యార్ధుల అభ్యంతరాలను మనవతాదృష్టితో పరీశీలించి పరీక్ష వాయిదా వేయాలని లోకేష్ కోరారు.