జనసేన అభ్యర్థి ఆస్తుల విలువ రూ.895 కోట్లు
ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.వాటిల్లో తమ ఆస్తుల వివరాలను, అప్పుల వివరాలను ప్రకటిస్తున్నారు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అత్యంత ధనవంతురాలైన అభ్యర్థిగా నిలిచారు. ప్రశాంతిరెడ్డి-ప్రభాకర్ రెడ్డి ఆస్తుల్లో మొదటి స్థానంలో నిలవగా తాజాగా ఆ స్థానంలో లోకం మాధవి నిలిచారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు.
వేమిరెడ్డి దంపతులకన్నా ఎక్కువ ఆస్తులను ఆమె చూపించారు. రూ.894.92 కోట్లుగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆమెపైనే దృష్టిసారించారు. ఆమె ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో ఉద్యోగం చేశారు. భర్త లోకం ప్రసాద్ తో కలిసి మిరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ మంచి లాభాల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సంస్థలను విస్తరించారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ముంజేరు గ్రామంలో మిరాకిల్ కంపెనీ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రధాన క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది.

అమెరికాలోని వినియోగదారులకు ఇక్కడి నుంచే సేవలందిస్తుంటారు. భోగాపురం దగ్గర విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిగా పోటీచేసి.. ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పొత్తులో భాగంగా కూటమి నుంచి సీటును జనసేనకు కేటాయించారు. అఫిడవిట్ లో ఆమె ఆస్తుల వివరాలు చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆస్తుల విలువలో మాధవి ముందువరుసలో ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ అండతో ఎన్నికల్లో కచ్చితంగా జనసేన విజయం సాధిస్తుందని మాధవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రచారానికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.












Click it and Unblock the Notifications