'అది నా చేతుల్లో లేదు': 'చంద్రబాబుకు నైతిక విలువలున్నాయా?'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశానికి మేకపాటి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడితే దానిని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన పక్కకు పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు సొంత పనులను చక్కబెట్టుకునేందుకు టీడీపీలోకి వెళుతున్నారని అన్నారు.
వైసీపీ బీఫాంపై గెలిచి వేరే పార్టీలోకి వెళుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రజల మద్దతు ఉందని, ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంభిస్తోన్న చర్యల మూలంగా టీడీపీ ప్రతిష్ట దిగజారీ పోతుందని ఆయన చెప్పారు. అసలు చంద్రబాబుకు నైతిక విలువలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్యర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ అపాయింట్ మెంట్పై ఎంపీ హరిబాబు
ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ తీసుకోవడం తన చేతుల్లో లేదని ఏపీ అఖిలపక్ష నేతలతో బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ విషయమై ప్రధానితో మాట్లాడేందుకు తమను కేంద్రం దగ్గరకు తీసుకువెళ్లాలని కంభంపాటిని అఖిల పక్ష ప్రతినిధులు కోరగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు.
ప్రధాని మోడీని కలిసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవాలని చెప్పిన బీజీపీ ఎంపీ హరిబాబు తీరుపై అఖిలపక్ష నేతలు అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications