20 గ్రామాలకు రాకపోకలు బంద్: నెల్లూరు-ముంబై జాతీయ రహదారికి గండికొట్టిన గ్రామస్తులు
అమరావతి: నెల్లూరు జిల్లాలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. నెల్లూరు-ముంబై ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నెల్లూరు-ముంబై జాతీయ రహదారికి గ్రామస్తులు గండికొట్టారు. తద్వారా హైవేపై ట్రాఫిక్ జామ్ పూర్తిగా నిలిచిపోయింది. వరద ఉదృతి తగ్గితే గానీ, సహాయక చర్యలు చేపట్టేందుకు వీలులేని పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు.
గూడూరు డివిజన్లో కైవల్యానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ క్రమంలో 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాకిలి దగ్గర చెరువుకు గండి పడి ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వెంకటగిరి మండలం పాపమాంబపురం చెరువుకు గండి పడింది.
తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పీలేరు మండలం బాలంవారిపల్లె దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వంతెనపై క్వాలీస్ వాహనం చిక్కుకుంది. దీంతో రక్షించాలంటూ అందులో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.
హుటాహుటిన వాగు వద్దకు చేరుకున్న పోలీసులు క్వాలీస్లోని ఆరుగురు ప్రయాణికులను కాపాడారు.
గుంతకల్లులో పిచ్చికుక్కల స్వైరవిహారం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే మైదానంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ సంఘటనలో 20 మంది గాయపడ్డారు. కుక్క కాటుతో గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కుక్కల బెడదను నివారించాలని ప్రజలు మున్సిపల్ సిబ్బందిని డిమాండ్ చేశారు.