అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా. ఆయన తీరే వేరు...
నెల్లూరు లాంటి నగరంలో మురుగనీటి కాల్వల్లో పూడిక తీయాలంటే పట్టంచుకునే నాథుడే లేడు.. అడుగు తీసి అడుగు వేయలేనంతగా గుంతల మయం.. జగనన్న కాలనీల్లో వసతుల గురించి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.. ఏం పని జరుగుతుందో.. ఏ పని జరగడంలేదో అర్థంకాని పరిస్థితి.. అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. సహజంగా అయితే ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు చేస్తాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ పలు సమస్యల గురించి ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవలే జరిగిన జిల్లా ప్లీనరీల్లో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన తీరు చర్చనీయాంశంగా మారింది.

సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నిస్తా
తాజాగా రూరల్ నియోజకర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగుకాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. అధికారులు స్పందించకపోవడంతో ఆయనే మురుగుకాల్వలోకి దిగి నిరసన తెలియజేశారు. ప్రజా సమస్యలపై తాను అధికార పక్షమా? ప్రతిపక్షమా? అని చూడనని వాటి పరిష్కారం కోసమే ప్రయత్నిస్తానన్నారు.

రోడ్లకు రూ.100 కోట్లు కావాలి?
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ మండలం వావిలేటపాడు జగనన్న లేఔట్ లో కనీస సౌకర్యాలు లేవని, 10 నెలల నుంచి సమస్యను పరిష్కరించే నాథుడే లేరన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలంటే రూ.100 కోట్లు అవుతుందని శ్రీధర్ రెడ్డి అన్నారు.

త్వరలోనే పూర్తవుతాయి.. కాకాణి
బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. జిల్లాకు ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా తెలియడంలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రోడ్ల పనులు చేపట్టామని, త్వరలో పూర్తవుతాయని కాకాణి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications