ఆనం సంపాదించారు, రూ.50 కోట్లు ఖర్చు పెడతావా అని అడిగారు: జగన్కు బొమ్మిరెడ్డి షాక్, రాజీనామా
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గట్టి షాక్ తగిలింది. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రా రెడ్డి శనివారం వైసీపీకి రాజీనామా చేశారు. తనకు అప్పగించాల్సిన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు మరొకరికి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాకు చెప్పకుండా ఆనంకు బాధ్యతలు
మాజీ ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తన ప్రమేయం లేకుండా పార్టీలోకి ఆహ్వానించడం, ఆయనకు వెంకటగిరి బాధ్యతలు అప్పగించడం తనను ఆవేదనకు గురి చేశాయని బొమ్మిరెడ్డి అన్నారు. ఆనం విషయంలో తనకు ఒక్కమాటా చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
నా విషయంలో మేకపాటి కూడా ఏం చేయలేకపోయారు
జగన్ నియంతలా వ్యవహరిస్తున్న తీరుకు మనస్తాపం చెందానని బొమ్మిరెడ్డి చెప్పారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. జగన్ నియంతృత్వ ధోరణి తనను బాధించిందని చెప్పారు. ఆయనది ఏకస్వామ్య వైఖరి అన్నారు. తన విషయంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారన్నారు.
ఆనం బాగా సంపాదించారు, నువ్వు రూ.50 కోట్లు ఖర్చు పెడతావా
వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును జగన్ డబ్బుతో కొలిచారని బొమ్మిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఇటీవల హైదరాబాదులోని లోటస్ పాండ్కు జగన్ కారులో వెళ్తున్న సమయంలో ఆయన మాటలు విని ఆశ్యర్యపోయానని చెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాగా సంపాదించారని, ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే సీటుకు రూ.50 కోట్ల వరకు ఖర్చు పెడతారని, ఈ విషయాన్ని నాతో చెప్పారని, నువ్వు అంత మొత్తం ఖర్చు పెడతావా అని తనను అడిగారని వాపోయారు. నీ వద్ద అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయా అని అడిగారన్నారు. తాను మాత్రం అన్ని కోట్లు ఖర్చు పెట్టలేనని, కానీ ఎన్నికలను ఎదుర్కొంటానని చెప్పానని, ఆ తర్వాత ఆనం పార్టీలోకి రావడం, ఆయనకు టిక్కెట్ కేటాయించడం జరిగిందన్నారు.
డిక్టేటర్లా, నన్ను అవమానించారు
తాను ఏ రోజూ పార్టీ గురించి లేదా జగన్ గురించి అగౌరవంగా మాట్లాడలేదని బొమ్మిరెడ్డి చెప్పారు. తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగవద్దన్నారు. జగన్ డిక్టేటర్లా వ్యవహరించి, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనను అవమానించారన్నారు.