అమరావతి కోసం రంగంలోకి నెదర్లాండ్స్ ..! నారాయణ కీలక ప్రకటన..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలు వేగంగా సాగిపోతుండగా.. మధ్యలో వచ్చిన వరదలతో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి గ్రాఫిక్స్ అని, వరదలకు మునిగిపోయిందనే ప్రచారాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటోంది. ఈ మేరకు మంత్రి నారాయణ ఇవాళ కీలక ప్రకటన చేశారు.
అమరావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి చాలా సేఫ్ సిటీ అన్నారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలని ఆయన సూచించారు. మార్చి నెలాఖరుకు అధికారులు,ఉద్యోగులకు భవనాలు సిద్దం చేస్తామని తెలిపారు. ఇవాళ రాజధానిలోని నిర్మాణాలను పరిశీలించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిలో 360 కిమీ మేర ట్రంక్ రోడ్లు,1500 కిమీ మేర లే అవుట్ రోడ్లు,4000 నివాస భవనాలు,ఐకానిక్ భవనాలు పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతిలో వరద నివారణ కొరకు నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించామన్నారు. అమరావతికి ఎలాంటి ముంపు లేకుండా కాలువలు,రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా చెప్పిన ప్రకారం మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు..

నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ -1,టైప్ -2 భవనాలతో పాటు గ్రూప్-డి ఉద్యోగుల భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటి వరకూ పూర్తవుతాయి, భవనాలతో పాటు ఇతర మౌళిక వసతుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సీఆర్డీఏ ఇంజినీరింగ్ అధికారులను,కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి పనుల్లో ప్రస్తుతం 13వేల మంది ఉద్యోగులు,కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. అలాగే ప్రొక్లెయిన్ లు,జేసీబీలు,ఇతర యంత్రాలు సుమారు 2500 వరకూ పనిచేస్తున్నాయని, వర్షాలు కూడా తగ్గడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications