బ్రహ్మోత్సవాల్లో ఆ చౌల్ట్రీల్లో 60 శాతం వసతి గదుల కేటాయింపు వారికే..: తేల్చేసిన టీటీడీ
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం సెప్టెంబర్ లో పండగల శోభతో విలసిల్లబోతోంది. కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుదీరిన ఈ పవిత్ర గిరులపై ఈ నెలలోనే వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పలు ముఖ్యమైన పండుగలు, విశేష ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు వరుస సమీక్షలను నిర్వహిస్తోన్నారు. టికెట్లు మొదలుకుని లగేజీ, వసతి గదుల కేటాయింపు.. వంటి ప్రతి అంశంపైనా విభాగాలవారీగా ఈ సమీక్షా సమావేశాలు సాగుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడికీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. అన్నప్రసాదాల వితరణ, లడ్డూ అమ్మకాలు, వైద్య సేవలపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో వసతి గదుల కేటాయింపు, భక్తులకు అందించాల్సిన వైద్య సేవలపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి వేర్వేరుగా రివ్యూ సమావేశాలను నిర్వహించారు. ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వసతి గదుల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవ విధులకు డెప్యుటేషన్ పై వచ్చే సిబ్బందికి వసతి కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రిసెప్షన్ విభాగానికి ఆదేశించారు.
తిరుమలలోని అన్ని మఠాలు, కర్ణాటక సత్రాల్లో 60 శాతం గదులను బ్రహ్మోత్సవ రోజుల్లో టీటీడీ రిసెప్షన్ విభాగం తన నియంత్రణలోకి తీసుకోవాలని చెప్పారు. పలువురు సిబ్బంది టీటీడీ విధుల నిర్వహణ కోసం డెప్యుటేషన్ పై తిరుమలకు రానున్నారని, వారికి సరైన వసతి సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా మఠాలు, కర్ణాటక చౌల్ట్రీతో ముందుగానే సంప్రదింపులు జరపాలని, 60 శాతం గదులను తమ పరిధిలోకి తెచ్చుకోవాలని అన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలు అందించడానికి తిరుమలలో అశ్వినీ ఆసుపత్రి, అపోలో కార్డియాక్ సెంటర్లు 24 గంటలు నిరంతరాయంగా పని చేస్తాయని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2, గాలి గోపురం, ఏటీసీ, కల్యాణకట్ఠ, పీఏసీ-5 ప్రాంతాల్లో ఆరు డిస్పెన్సరీలు అందుబాటులో ఉంటాయని అన్నారు. పీఏసీ-2, భాష్యకార్ల సన్నిధి, అలిపిరి రాజగోపురం, 1500 మెట్టు, ఏడో మైలు, శ్రీవారి మెట్టు 1200 మెట్టు, అన్న ప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, నారాయణగిరి షెడ్లల్లో 10 హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.
కృష్ణతేజ సర్కిల్ నుండి గోగర్భం సర్కిల్ వరకు దర్శన క్యూలైన్లలో ఓ మొబైల్ క్లినిక్, రామ్ బగీచా, శిలాతోరణం, పాపనాశనం, శ్రీవారి సేవా సదన్, శ్రీవారి మెట్టు, అలిపిరి పాదాల మండపం వద్ద నూతనంగా ఆరు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 11 మంది డాక్టర్లు, 139 మంది పారా మెడికల్ సిబ్బందికి అదనంగా 75 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
అత్యవసర వైద్య సేవల కోసం తిరుమలలో మొత్తం 16 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన వైద్య సేవలు అందించాలని, రద్దీకి అనుగుణంగా మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. మాడ వీధుల్లో భక్తులకు సమస్యలు తలెత్తితే పోలీసుల సమన్వయంతో సురక్షితంగా త్వరితగితిన ఆసుపత్రికి తరలించాలని చెప్పారు.














Click it and Unblock the Notifications