జగన్ పరువు తీస్తున్న కొత్త మంత్రులు-పాత వాళ్లే నయం-విపక్షాలు, మీడియా చెడుగుడు ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్ కేబినెట్ ప్రక్షాళన చేశారు. ఇందులో పలువురు కొత్త మంత్రులకు చోటిచ్చారు. అలాగే పాత మంత్రుల శాఖల్నీ మార్చారు. అయితే ఆయా శాఖలపై వారి పట్టు సంగతేమో కానీ వారు నిత్యం చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా సున్నిత అంశాలపై చేస్తున్న కామెంట్లు మాత్రం ప్రభుత్వ పరువు తీసేలా ఉంటున్నాయి. తాజాగా తానేటి వనిత రేప్ లపై చేసిన వ్యాఖ్యలు కానీ, అంబటి రాంబాబు పోలవరంపై చేసిన కామెంట్స్ కానీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి.

జగన్ కొత్త మంత్రుల వివాదాలు
ఏపీలో జగన్ కేబినెట్ ప్రక్షాళన సందర్భంగా దాదాపు 10 మందికి పైగా కొత్త మంత్రుల్ని తీసుకున్నారు. అలాగే పాత్ర మంత్రుల శాఖల్లోనూ కీలక మార్పులు చేశారు. ఆ తర్వాత కొత్త శాఖల్ని తీసుకున్న మంత్రులు బాధ్యతలు చేపట్టగానే జూలు విదల్చడం మొదలుపెట్టారు. ముందుగా సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ జగన్ ను మెప్పించాలంటూ జర్నలిస్టులకు ఇచ్చిన సలహాతో వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జలవనరుల మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యానికి అద్దం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న వరుస రేప్ లపై మహిళా హోంమంత్రి చేస్తున్న వ్యాఖ్యలైతే ఆమెతో పాటు ప్రభుత్వం పరువు కూడా తీస్తున్నాయి.

వైవీ కాళ్లు మొక్కిన వేణుగోపాలకృష్ణ
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ శెట్టిబలిజలకు ప్రభుత్వం న్యాయం చేసిందంటూ నిండు సభలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కారు. మోకాళ్లపై కూర్చుని వైవీకి ఆయన మొక్కడంపై ఇప్పుడు ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలే తొలిసారి వైసీపీ వైపు మొగ్గిన శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలకు వేణుగోపాలకృష్ణ చర్య తీవ్ర అవమానంగా మారింది. దీంతో శెట్టిబలిజల్ని అవమానించిన మంత్రి వేణు క్షమాపణలు చెప్పాలని వారు పట్టుబడుతున్నారు.

హోంమంత్రి కామెంట్స్ రచ్చ
రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. వాటిపై వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసేస్తున్న దిశ చట్టం కొరడా ఝళిపించలేకపోతోంది. అదే సమయంలో కొత్తగా హోంమంత్రి అయిన తానేటి వనిత చేస్తున్న వ్యాఖ్యలు మహిళల్లో ఆగ్రహం నింపుతున్నాయి. విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి పరామర్శకు వెళ్లి ఏం జరిగిందంటూ అక్కడ పోలీసుల్ని ఆమె అడగడం వివాదాస్పదమైంది. తాజాగా రేపల్లె గ్యాంగ్ రేప్ పై స్పందిస్తూ అత్యాచారాలు కొన్ని అలాగే జరుగుతుంటాయంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్ కావడమే కాక వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది.

జగన్ ఎన్నికల టీమ్ ఇదేనా ?
సామాజిక సమీకరణే అర్హతలుగా తాను కొత్తగా తీసుకున్న మంత్రులు ఒక్కొక్కరిగా జూలు విదుల్చుతున్నారు. సున్నితమైన అంశాలపై ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారు. విషయ పరిజ్ఞానం లేకపోయినా పర్వాలేదు కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా సీఎం జగన్ కానీ, సకల మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల కానీ వాటిపై పల్లెత్తు మాట అనేందుకు జంకుతున్నారు. బహిరంగంగా కాకపోయినా పార్టీలో అంతర్గతంగా అయినా వారిని మందలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. అసలే ఎన్నికల టీమ్ గా చెప్పుకుంటూ తీసుకున్న మంత్రులు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి వైసీపీ విజయానికి వీరు ఎలా ఉపయోగపడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications